21 ఏళ్ల జైలు జీవితం.. తర్వాత నిర్దోషిగా తీర్పు

24 Aug, 2019 09:47 IST|Sakshi

కటక్‌: సాక్ష్యాధారాలను క్షుణ్నంగా పరిశీలించడంలో జిల్లా కోర్టు పొరపాటు చేయడంతో ఓ వ్యక్తి 21 ఏళ్ల 9 నెలల జైలు శిక్ష అనుభవించి... ఆ తరవాత నిర్దోషిగా విడుదలైన ఘటన ఒడిశాలో జరిగింది. గంజామ్‌ జిల్లాలోని కంటపాడ గ్రామానికి చెందిన సాధు ప్రధాన్‌ 1997 నవంబర్‌లో హత్య కేసులో అరెస్టయ్యారు. మహిళను హత్య చేయడంతో పాటు ఆమె ఆభరణాలను కూడా దొంగిలించాడని జిల్లా కోర్టు అతన్ని దోషిగా తేలుస్తూ 1999 ఆగస్టులో జీవిత ఖైదు విధించింది. అనంతరం అతడు హైకోర్టులో తీర్పును సవాల్‌ చేశారు.

ఈ వ్యాజ్యం జూలైలో జస్టిస్‌ ఎస్కే మిశ్రా, ఏకే మిశ్రాల ధర్మాసనం ఎదుటకు వచ్చింది. సాక్ష్యాధారాలను సరైన కోణంలో పరిశీలించని కింది కోర్టు పొరపాటు చేసిందని పేర్కొంటూ... తీర్పును సవరించి హైకోర్టు సోమవారం ఆయన్ను విడుదల చేసింది. హత్య వెనుక కారణాలను నిరూపించడంలో ప్రాసెక్యూషన్‌ విఫలమైందని తీర్పు సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.  

మరిన్ని వార్తలు