నడిరోడ్డుపై చెప్పుతో కొట్టిన విద్యార్థిని..

5 Aug, 2018 08:57 IST|Sakshi

 కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

బరంపురం: మహిళా రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా రోడ్‌సైడ్‌ రోమియోల అగడాలకు అడ్డులేకుండా పోతోంది.   ఇందుకు బరంపురం నగరమే ఉదాహరణగా నిలిచిందనడానికి  మూడు రోజుల క్రితం నగరంలోని గాంధీనగర్‌ మెయిన్‌ రోడ్‌లో జరిగిన సంఘటన రుజువు చేస్తోంది. మూడు రోజుల క్రితం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి గాంధీనగర్‌ సాయి కాంప్లెక్స్‌ దగ్గర మహామాయి మహిళా కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్థిని కళాశాలకు వెళ్తున్న సమయంలో రోడ్‌సైడ్‌ రోమియో తీవ్రంగా కామెంట్‌ చేయడంతో బాధిత విద్యార్థిని తీవ్రంగా ప్రతిఘటించి తన చెప్పు తీసి రోమియో చొక్కా పట్టుకుని చెంపలు వాయించింది.

 ఈ సంఘటనపై స్థానికులు సెల్‌ఫోన్‌లలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన  కొద్ది నిమిషాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. మరి కొన్ని చానల్స్‌ రోజంతా పదే పదే చూపించడంతో రాష్ట్ర హోం శాఖ తీవ్ర స్థాయిలో స్పందించి ంది. ఈ నేపథ్యంలో వెంటనే రోడ్‌సైడ్‌ రోమి యోను అరెస్ట్‌ చేయాలని ఇటువంటి రోమియాలపై గట్టి చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖను ఆదేశించింది. ఈ మేరకు బరంపురం ఎస్‌పీ పినాకి మిశ్రా టౌన్‌ పోలీసులను ఆదేశించగా శనివారం టౌన్‌ పోలీసులు జుమోటోగా రోడ్‌సైడ్‌ రోమియోను అరెస్ట్‌ చేసి సాయంత్రం ఎస్‌డీజేఎం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

మరిన్ని వార్తలు