గుంటూరు జిల్లా మోర్జంపాడులో టీడీపీ నేతల అరాచకం
మాచవరం(గురజాల): బ్యానర్ ఏర్పాటులో చెలరేగిన వివాదంలో పక్కా ప్రణాళికతో రాళ్లతో వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడిచేసిన సంఘటన శనివారం రాత్రి గుంటూరు జిల్లా మండలంలోని మోర్జంపాడు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గ్రామంలోని బస్టాండ్ సెంటర్లో స్వచ్ఛభారత్ పేరుతో 3 నెలల క్రితం హోర్డింగ్ను ఏర్పాటు చేశారు. అనంతరం పసుపు కుంకుమ పేరుతో టీడీపీ నాయకులు బ్యానర్ను ఏర్పాటు చేశారు. శుక్రవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు అదేచోట బ్యానర్ ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వివాదానికి దిగి, వైఎస్సార్సీపీ బ్యానర్ను చించివేశారు. దీంతో శనివారం ఇరువర్గాలను స్థానిక ఎస్ఐ ఆనంద్ పిలిపించి మాట్లాడుతున్న క్రమంలో టీడీపీ శ్రేణులు తమ బ్యానర్ను తొలగించే ప్రసక్తేలేదని అడ్డం తిరిగారు. అంతటితో ఆగక వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లు, సీసాలు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో బాదం రామకృష్ణ, దారం లచ్చిరెడ్డి, శ్రీనులకు తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో 2 గంటలపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.