సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక సమస్యలతో ప్రజలు, రైతులు సతమతమవుతున్నా పట్టించుకోని కేంద్రం విదేశీ కంపెనీలకు మాత్రం ఎర్ర తివాచీ పరుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్, నిర్మాణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను 100 శాతానికి అనుమతిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు.
ఈ చర్యను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించి కేంద్రం దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎన్నికల వాగ్దానాలను మరిచి బీజేపీ ఈ విధంగా వ్యవహరించడం ప్రజలను మోసం చేయడమేనని చాడ విమర్శించారు. బీజేపీ విధానాలు, సంఘ్ పరివార్ శక్తుల ఆగడాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని సీపీఐ జాతీయ సమితి నిర్ణయించిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గురువారం చెప్పారు.