అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీ కండువా

15 Nov, 2019 02:55 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కన్నడనాట రాజకీయాలు ఊపందుకున్నాయి. అనర్హుల్లో రోషన్‌ బేగ్‌ తప్ప అందరూ అధికార బీజేపీలో చేరారు. వీరు డిసెంబరులో జరిగే 15 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని, వారిలో పలువురు కాబోయే మంత్రులని ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప స్పష్టం చేశారు. అనర్హత ఎమ్మెల్యేల్లో 17 మందికి గాను 16 మందికి గురువారం బెంగళూరులో బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యడియూరప్ప కాషాయ కండువా కప్పారు. బెంగళూరు శివాజీనగర కాంగ్రెస్‌ అనర్హత ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ను బీజేపీలోకి ఆహ్వానించలేదు. టికెట్‌ కూడా ఇవ్వలేదు. కాగా, కొత్త నేతల రాకను బీజేపీ స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో బుజ్జగించడం యడ్యూరప్ప ముందున్న ప్రధాన కర్తవ్యంగా మారింది.

మరిన్ని వార్తలు