న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల పంపణీపై రాజ్యసభలో ఆందోళనకు దిగిన ఏఐఏడీఎంకే, డీఎంకే సభ్యులను చైర్మన్ వెంకయ్యనాయుడు బయటకు పంపించారు. ఇదే అంశంపై గందరగోళం తలెత్తడంతో సభ తొలుత రెండుసార్లు, ఆ తరువాత రోజంతటికీ వాయిదా పడింది. నిబంధన 255ని అనుసరించి..తమిళనాడుకు చెందిన డజనుకుపైగా ఎంపీలు రోజంతా సభ కు దూరంగా ఉండాలని వెంకయ్య ఆదేశించారు. మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే ఏఐఏడీఎంకే సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి డీఎంకే సభ్యులు మద్దతు పలికారు. జల వనరుల మంత్రి గడ్కరీ బదులిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి విజయ్ గోయల్ చెప్పినా వారు వినిపించుకోలేదు.