సాక్షి, యలమంచిలి : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 247వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం అచ్యుతాపురం నైట్ క్యాంపు నుంచి ప్రారంభించారు. అక్కడ నుంచి అచ్యుతాపురం మండలంలోని అప్పన్నపాలెం, మదుటూరు జంక్షన్, సానికాలువ, చీమలపల్లి మీదుగా పాదయాత్ర సాగనుంది. లంచ్ విరామం అనంతరం వైఎస్ జగన్ బంగారం పల్లి క్రాస్ మీదుగా కొండకర్ల, కొండకర్ల జంక్షన్ వరకు పాదయాత్ర కొనసాగిస్తారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. కాగా, వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ జగన్ పాదయాత్ర సాగిస్తున్నారు. నేనున్నానంటూ వారికి భరోసానిస్తున్నారు.