ఆ కుటుంబంలో 66 ఓట్లున్నాయ్‌!

13 May, 2019 05:30 IST|Sakshi

అలహాబాద్‌లోని బహ్రయిచా గ్రామానికి చెందిన రామ్‌ నరేశ్‌ భుర్తియా కుటుంబ సభ్యులు మొత్తం 82 మంది. వారిలో ఓటు హక్కున్న వాళ్లు 66 మంది. కాబట్టే అభ్యర్ధులంతా భుర్తియాను బుజ్జగించేందుకు వస్తారు. ప్రత్యేకంగా హామీలు కూడా ఇస్తారు. అయితే, వాటిని నెరవేర్చడం లేదని 98 ఏళ్ల నరేశ్‌ ఆరోపిస్తున్నారనుకోండి. వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న ఈ ఉమ్మడి కుటుంబం ఆర్థికంగా మంచి స్థానంలోనే ఉంది. ప్రస్తుతం వీరంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అది మట్టి ఇల్లు. దాని స్థానంలో పక్కా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు.అయితే, ఆ ఇంటి మీదుగా హై టెన్షన్‌ కరెంటు వైర్లు వెళుతున్నాయి. వాటిని తొలగిస్తే తాము పక్కా ఇల్లు కట్టుకుంటామని నరేశ్‌ ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థులను  కోరడం, వారు హామీ ఇవ్వడం జరుగుతోందే కాని ఇంత వరకు పని కాలేదు.అయినా వాళ్లు ఓట్లువేయడం మానడం లేదు. వచ్చే సారి మాత్రం మా సమస్య పరిష్కరించిన వారికే ఓటు వేస్తామని కచ్చితంగా చెబుతున్నాడు నరేశ్‌ మనుమడు శంకర్‌.    

మరిన్ని వార్తలు