‘ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్‌’

6 Mar, 2019 16:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డేటా చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ1 నిందితుడని, ఆయన కుమారుడు నారా లోకేష్‌ ఏ2 అని వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు ఆరోపించారు. చంద్రబాబు చెప్పేవన్నీ నీతులు.. చేసేవన్నీ దొంగపనులంటూ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబును ఓటమి భయం వెంటాడుతోందన్నారు. సైబర్‌ క్రైమ్‌కు తెరలేపిన చంద్రబాబును కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. లబ్ధిదారులు, వారి బ్యాంక్‌ అకౌంట్ల డేటాను తస్కరించారని ఆరోపించారు.

ఆధార్‌ నుంచి ఆర్‌బీఐ వరకు అన్నిచోట్లా డేటా చోరీ చేశారన్నారు. అన్ని ప్రభుత్వ వ్యవస్థల నుంచి డేటాను చోరీ చేశారని, ప్రజల డేటాను చోరీ చేసే అసాధ్యుడిగా బాబు పేరు తెచ్చుకున్నారని విమర్శించారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్‌కు నేరం ఎలా చేయాలో నేర్పారని అన్నారు. సేవా మిత్ర యాప్‌ సంస్థతో మీకున్న సంబంధం ఏంటి?.. టీడీపీ సేవా మిత్ర యాప్‌లో ప్రజాడేటా ఎందుకు ఉంది?.. కలర్‌ ఫోటో ఉన్న ప్రజల డేటా వారికి ఎలా వచ్చింది? అంటూ  ప్రశ్నల వర్షం కురిపించారు. వీటన్నింటికి తండ్రికొడుకులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు