డిపాజిట్లు కోల్పోయిన మొత్తం అభ్యర్ధులు

16 May, 2018 10:55 IST|Sakshi

కన్నడ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన ఆమ్‌ ఆద్మీ అభ్యర్థులు

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలనుకుంటున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్‌ కేజ్రివాల్‌కి అన్ని రాష్ట్రాల్లో నిరాశే మిగిలుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్‌ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో పోటీ చేసిన 29 స్థానాల్లో ఆప్‌ ఆభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు. తమ పార్టీకి కన్నడ ప్రజల్లో మంచి ఆదరణ లభించిదని, దానిని ఓటింగ్‌గా మార్చుకోవడంలో తమ అభ్యర్ధులు విఫలమయ్యరని కర్ణాటక ఆప్‌ కన్వీనర్‌ పృథ్వీరెడ్డి తెలిపారు.

శ్రావన్‌నగర్‌ నుంచి పోటీ చేసిన పృథ్వీ కేవలం 1861 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. శాంతి నగర్‌ నుంచి పోటీ చేసిన ఆప్‌ అభ్యర్థి రేణుక విశ్వనాధన్‌ ఒక్కరే నోటాకి పడిన ఓట్లకంటే ఎక్కువ ఓట్లు సాధించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ అభ్యర్ధులు సాధించిన ఓటింగ్‌ శాతం కేవలం 0.2 మాత్రమే. 2017 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో ఆప్‌ విజయం సాధించిన విజయం తెలిసిందే. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా విస్తరించాలని ఆప్‌ పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసింది.

ముఖ్యంగా పంజాబ్‌లో పాగా వేయాలనుకున్న అరవింద్‌ కేజ్రివాల్‌కి పంజాబ్‌ ఫలితాలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అధికారంలోకి రావాలనుకున్న ఆప్‌ కేవలం 22 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ తరువాత జరిగిన గుజరాత్‌ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అనుకున్న రీతిలో ఫలితాలను సాధించలేకపోయింది. గోవా, నాగాలాండ్‌, మిజోరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్‌  ఒక్క రాష్ట్రంలో కూడా ఖాతా తెరవలేకపోయింది.

మరిన్ని వార్తలు