‘తెలంగాణలోనూ పోటీకి సిద్దం’

21 Sep, 2018 19:21 IST|Sakshi
సోమనాథ్‌ భారతి(ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ:  కనివిని ఎరుగని రీతిలో ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌).. నెమ్మదిగి అన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని కోరుకుంది. కానీ ఇప్పటి వరకు ఢిల్లీ మినహా పోటీ చేసిన అన్ని రాష్ట్రాల్లో బొక్క బోర్లా పడింది. తాజాగా దక్షిణ భారత దేశంలో తమ పార్టీ ఉనికిని చాటుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని ఆప్‌ నిర్ణయించింది. దీనిక సంబంధించిన విషయాన్ని ఆ పార్టీ దక్షిణ భారత్‌ ఇంఛార్జి సోమనాథ్‌ భారతి మీడియాకు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలలో పోటీ చేస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికే మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర పార్టీలకు చెందిన నేతలు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్‌.. మోదీని మించిపోయారు
అమలు కాని అబద్దపు హామీలు ఇవ్వడంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. మోదీని మించిపోయారిన విమర్శించారు. కాంగ్రెస్‌ సారథ్యంలోని మహా కూటమితో పోత్తు పెట్టుకునే అవకాశమే లేదని, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. త్వరలో ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారని తెలిపారు. సామాన్య ప్రజల కోసం ఆవిర్భవించిన తమ పార్టీకి అవకాశం ఇస్తే ఎలాంటి పాలన అందిస్తామో ఢిల్లీలో నిరూపించామని.. అవకాశమిస్తే తెలంగాణలోనూ అలాంటి పాలనే అందిస్తామని వివరించారు. త్వరలోనే ఆప్‌ అభ్యర్థులు, మేనిఫెస్టో ప్రకటిస్తామని భారతి తెలిపారు.
  

మరిన్ని వార్తలు