దేశవ్యాప్తంగా ఆప్‌ విస్తరణ!

15 Feb, 2020 08:20 IST|Sakshi
గోపాల్‌ రాయ్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతవిజయం అందుకుని ఉత్సాహంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ని ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీ విస్తరణలో భాగంగా అన్ని రాష్ట్రాల్లోనూ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆప్‌ పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత గోపాల్‌ రాయ్‌ శుక్రవారం వెల్లడించారు. తొలుత మధ్యప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్‌ పోటీ చేయనున్నట్లు తెలిపారు. సానుకూల జాతీయవాదంతో పార్టీని విస్తరించేందుకు ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేవిధంగా కేజ్రీవాల్‌ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు.

పార్టీలో చేరాలనుకునే వారెవరైనా 9871010101 నంబర్‌కు మిస్‌డ్‌ కాల్‌ ఇవ్వొచ్చని చెప్పారు. ఈనెల 16న రామ్‌లీలా మైదానంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని మోదీకి అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం ఆహ్వానం పంపించినట్లు గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు. ప్రధాని హాజరయ్యేదీ లేనిదీ తెలియదన్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి ప్రజలు హాజరు కావాలని పత్రికల ద్వారా కేజ్రీవాల్‌ ఆహ్వానం పంపించారు. (చదవండి: 24 గంటల్లో 11 లక్షల కొత్త సభ్యులు)

మరిన్ని వార్తలు