‘కాంగ్రెస్‌కు పోయేకాలం వచ్చింది’

12 Nov, 2019 17:21 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ఉపయోగించుకోలేదని మహారాష్ట్ర ఆప్‌ నాయకురాలు ప్రీతి శర్మ మేనన్‌ విమర్శించారు. మహారాష్ట్రను బీజేపీకి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్‌ ఇదే తరహాలో వ్యవహరించిందని దుయ్యబట్టారు. ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు నిరాకరించి బీజేపీ గెలుపునకు బాటలు పరిచిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక పార్టీ నిర్ణయాన్ని విస్మరించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శరద్‌ పవార్‌తో కలిసి నడవాలని సూచించారు. కాంగ్రెస్‌కు ఇక కాలం చెల్లిందంటూ విమర్శలు గుప్పించారు.

తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ వెనక్కి తగ్గడంతో అవకాశం శివసేనకు వచ్చింది. అయితే ఎన్సీపీతో కలిసి శివసేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌ తర్జనభర్జలు పడింది. ఇక ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశం ఎన్సీపీకి వచ్చినా మద్దతు విషయంలో కాంగ్రెస్ జాప్యం చేసింది. మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి ఆహ్వానం అందింది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎన్సీపీ..కాంగ్రెస్‌, శివసేనలతో సంప్రదింపులు జరుపుతుండగానే రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ సిఫార్సు చేయడం, ఇందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేయడంపై విపక్షాలు విస్మయం వ్యక్తం చేశాయి.

మరిన్ని వార్తలు