‘తెలంగాణలో 38లక్షల నకిలీ ఓట్లు’

16 Sep, 2018 18:05 IST|Sakshi
అభిషేక్‌ మను సింఘ్వి(పాత చిత్రం)

సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలోని తప్పులను సరిచేసి అనంతరం తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఓటర్ల జాబితాలో ఉద్దేశపూర్వక మోసాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు కోరుకుంటున్నారని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌ పార్టీకి ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ తెలంగాణలో దాదాపు 70 లక్షలకు పైగా ఓట్లపై గందరగోళం నెలకొంది. తెలంగాణ ఓటర్ల జాబితాలో 38 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. ఓటర్ల జాబితాలో చాలా అవకతవకలు జరిగాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 20 లక్షల ఓట్లు తీసేశారు. దీనిపై ఇప్పటికే చాలాసార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. అయినా ఎలాంటి సంతృప్తికరమైన సమాధానం రాలేదు. ఏపీ, తెలంగాణలో రెండు చోట్ల 18 లక్షల ఓట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 17లక్షల ఓట్లు తీసేశారు. ఖమ్మంలోని కొంతభాగం ఏపీలో కలిసింది. ఆ ప్రాంతంలోని ఓట్ల జాబితాపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత  లేదు. మొత్తం ఓటర్ల జాబితాలో 20 శాతం తప్పులున్నాయి. వీటిని సరిచేయకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తార’ని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు