అబ్‌కీ బార్‌.. సెన్సార్‌షిప్‌ సర్కార్‌ : వైరల్‌ వీడియో ఊస్ట్‌

27 Oct, 2017 20:44 IST|Sakshi

పౌరులు ఏం తినాలో, ఎవర్ని పెళ్లాడాలో బీజేపీనే నిర్ణయిస్తుంది!

కేంద్ర సర్కారు తీరుపై కాంగ్రెస్‌ నేత సుర్జేవాల ఘాటు కౌంటర్‌

కమెడియన్‌ రంగీలా మిమిక్రీ వీడియో తొలగింపుపై అసహనం

సాక్షి, న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతోన్న ‘మోదీ, రాహుల్‌ మిమిక్రీ’ వీడియోను టీవీలో ప్రసారం చేయకపోవడంపై వివాదం రాజుకుంది. ఆఖరికి కామెడీ షోలపైనా నెన్సార్‌షిప్‌ విధిస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌ అయింది.

అబ్‌కీ బార్‌ సెన్సార్‌షిప్‌ సర్కార్‌ : ‘ఇది నిషేధాజ‍్క్షల ప్రభుత్వం. పౌరులు ఏం తినాలో, ఎలాంటి దుస్తులు ధరించాలో, ఏమేమి చూడాలో.. ఆఖరికి ఎవరిని పెళ్లాడాలో కూడా ప్రభుత్వమే నిర్ణయింస్తుంది. ఇక ఏం ఆలోచించాలన్నది కూడా వారి నిర్దేశాన్ని బట్టే జరగాలా!’’ అని సుర్జేవాలా రాసుకొచ్చిన సుర్జేవాలా.. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నినాదమైన ‘అబ్‌కీ బార్‌ మోదీ సర్కార్‌’ నినాదాన్ని ఎద్దేవా చేస్తూ ‘అబ్‌కీ బార్‌ సెన్సార్‌షిప్‌ సర్కార్‌’ అని శీర్షిక ఇచ్చారు. కమెడియన్‌ శ్యాం రంగీలా వీడియో వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏమిటా వీడియో? : మిమిక్రీ ఆర్టిస్టుగా ఇప్పటికే విపరీతమైన క్రేజ్‌ సంపాదించిన యువ కమెడియన్‌ శ్యాం రంగీలా.. ‘ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫర్‌ చాలెంజ్‌’ అనే రియాలిటీ కోసం ఇటీవల ఆడిషన్‌ ఇచ్చాడు. స్టార్‌ టీవీలో ప్రసారం అవుతోన్న ఆ షోలో ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ గాంధీలను అనుకరిస్తూ శ్యాం మిమిక్రీ చేశాడు. ఆ ఆడిషన్‌ తాలూకు వీడియో ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అయితే సదరు వీడియోను టీవీలో ప్రసారం చేయబోమని చానెల్‌ నిర్వాహకులు ప్రకటించడంతో వివాదం మొదలైంది.

మోదీని ఇమిటేట్‌ చెయ్యొద్దన్నారు : స్టాండప్‌ కమెడియన్‌ శ్యాం రంగీలా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ లాఫర్‌ చాలెంజ్‌- రియాలిటీ షో కోసం నేను ఇచ్చిన ఆడిషన్‌ను టీవీలో ప్రసారం చేయబోమని నిర్వాహకులు ఫోన్‌ చేసి చెప్పారు. తొలుత మోదీని ఇమిటేట్‌ చెయ్యొద్దని, ఆ తర్వాత రాహుల్‌ని కూడా అనుకరించొద్దని అన్నారు. చానెల్‌ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నందునే వీడియోను ప్రసారం చేయడంలేదన్నారు’’ అని ‘ది వైర్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
మోదీ, రాహుల్‌ను అనుకరిస్తూ రంగీలా మిమిక్రీ వీడియో 

మరిన్ని వార్తలు