కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తన రాజకీయ పార్టీ మంగళవారం ప్రారంభించారు. కర్ణాటక ప్రాజ్ఞవంత్ జనతా పక్ష(కేపీజేపీ) పేరుతో తన పార్టీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. బెంగళూరులోని గాంధీ భవన్లో తన పార్టీని ఆవిష్కరించారు. పార్టీ పేరును ప్రకటించిన ఉపేంద్ర, ఇది కేవలం పార్టీ కాదని, ప్రజల కోసం తమ పార్టీ అని తెలిపారు. ''నేను కేవలం మీకోసం ఓ ప్లాట్ఫామ్ను సృష్టిచాను. ఇందులో చేరాలని ఆసక్తి ఉన్నవారు జాయిన్ అవ్వొచ్చు. మార్పు తీసుకురావడమే నా డ్రీమ్'' అని ఉపేంద్ర తెలిపారు. తమ పార్టీ వ్యక్తిత్వాలపై దృష్టిపెట్టదని, మంచి సమాజాన్ని ఏర్పాటుచేయడానికే తాము కృషి చేయనున్నట్టు చెప్పారు. ప్రజలకు ఎక్కువగా అవసరమయ్యే వాటిపైనే తమ కేపీజేపీ దృష్టిసారించనుందని వెల్లడించారు. విద్య, అందరికీ ఆరోగ్య బీమా, మంచి మౌలిక సదుపాయాలు, చిన్న గ్రామాలు, వ్యవసాయభివృద్ధి, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం, స్థానిక ప్రతిభను ప్రోత్సహించడం తమ జాబితాలో చేర్చారు.
నవంబర్ 10న పార్టీ వెబ్సైట్, యాప్ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. సమాజాన్ని, రాష్ట్రాన్ని ఎలా మెరుగుపరచాలో తెలుపుతూ తమ ఆలోచనలతో ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు తమ వంతు సహకరించాలన్నారు. 2018 లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేపీజేపీ పార్టీ పోటీ చేయనుందని, ఈ ఎన్నికలకు కేవలం ఆరు నెలలే సమయం ఉందన్నారు. మనం గెలవకపోవచ్చు కానీ మార్పు తీసుకురావడం మనం ప్రధాన ధ్యేయమని తెలిపారు. గత కొన్ని రోజులుగా తన రాజకీయ రంగ ప్రవేశంపై ఉపేంద్ర పలు ప్రకటనలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. పార్టీలో చేరే ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తర్వాత పార్టీ పేరు, ఇతర వివరాలు వెల్లడిస్తానని చెప్పిన ఆయన, మంగళవారం ఆ ప్రకటన చేసేశారు.