సాక్షి, గుంతకల్లు టౌన్: నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సినీనటుడు, వైఎస్సార్సీపీ నేత అక్బర్ అలీ అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పామిడి, గుత్తి, గుంతకల్లులో ఆయన ప్రచారం నిర్వహించారు. గుంతకల్లులోని పోర్టర్స్లైన్లోని హజరత్ గులాంషా ఖాదరీ బాబా దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్సార్సీపీ గుంతకల్లు ఎమ్మెల్యే అభ్యర్థి వై.వెంకటరామిరెడ్డి, ఎంపీ అభ్యర్థి పీడీ రంగయ్యలకు మద్దతుగా అలీ రోడ్షో నిర్వహించారు.
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర్రెడ్డి అని కొనియాడారు. ఆయన తనయుడు జగన్ కూడా తండ్రి బాటలో పయనిస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీలకు ఐదు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించిన ఘనత కూడా వైఎస్సార్సీపీదేనన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో రోడ్షో విజయవంతమైంది.
వైఎస్సార్సీపీలోకి చంద్రశేఖర్
గుంతకల్లు టౌన్: అవోపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారవేత్త పువ్వాడి చంద్రశేఖర్ వైఎస్సార్సీపీలోకి చేరారు. రోడ్షోలో భాగంగా గుంతకల్లుకు విచ్చేసిన అలీ, గుంతకల్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.వెంకటరామిరెడ్డిల సమక్షంలో చంద్రశేఖర్ వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.