ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడి మార్పు

2 Jun, 2020 15:48 IST|Sakshi

న్యూఢిల్లీ :  దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఆదేశ్‌ కుమార్‌ గుప్తాను నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న మనోజ్‌ తివారీ స్థానంలో ఆదేశ్‌ గుప్తా నియమితులయ్యారు. బీజేపీ సీనియర్‌ నేతగా ఉన్న ఆదేశ్‌ కుమార్‌ గుప్తా.. గతంలో ఉత్తర ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మేయర్‌గా పనిచేశారు. 

కాగా, రెండు సార్లు ఎంపీగా ఉన్న మనోజ్‌ తివారి 2016లో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి వైదొలగాలని భావించినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే నూతన అధ్యక్షుడి ఎంపిక చేపట్టే వరకు పదవిలో కొనసాగాల్సిందిగా తివారీకి బీజేపీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా తెలిసింది. మరోవైపు ఇటీవల తివారీ లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. హరియాణాలోని ఓ అకాడమీలో క్రికెట్‌ ఆడటం వివాదానికి దారితీసింది.

మరిన్ని వార్తలు