-

రేవంత్‌ రెడ్డికి పదవి.. సీనియర్ల అసంతృప్తి!

19 Sep, 2018 19:59 IST|Sakshi

తెలంగాణ పీసీసీ కొత్త కమిటీ నియామకం

వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్

మరో 9 అనుబంధ కమిటీలను నియమించిన రాహుల్ గాంధీ

టీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్కే సురేశ్‌ రెడ్డి పేరును కూడా కమిటీలో చేర్చిన వైనం

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓ వైపు పొత్తు ప్రయత్నాలు చేస్తూనే.. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లే దిశగా పార్టీ కమిటీల నియామకంపై దృష్టి సారించింది. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ విభాగం కొత్త కమిటీని ఏఐసీసీ నియమించింది.

రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా రేవంత్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను నియమించిన రాహుల్‌ గాంధీ.. పార్టీని ప్రజల్లోకి తీసుకువేళ్లేందుకు.. కోర్ కమిటీ, కో- ఆర్డినేషన్ కమిటీ, క్యాంపెయిన్ కమిటీ, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ, ఎల్‌డీఎమ్‌ఆర్‌సీ కమిటీ, ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ, డిసిప్లీనరీ యాక్షన్ కమిటీ పేరుతో మరో తొమ్మిది అనుబంధ కమిటీలను కూడా నియమించారు. కాగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రేవంత్‌ రెడ్డిని నియమించడంపై సీనియర్‌ నేతలు వి. హనుమంతారావు, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన సురేశ్‌ రెడ్డి పేరును కూడా కో- ఆర్డినేషన్‌ కమిటీలో చేర్చడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

ఏ కమిటీలో ఎవరెవరు?
కోర్ కమిటీ
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు ఎన్.ఎస్. బోసురాజు, శ్రీనివాసన్ కృష్ణన్, సలీం అహ్మద్‌తో పాటు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి గౌడ్, జి. చిన్నారెడ్డి, ఎ. సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డిలు కోర్‌ కమిటీ సభ్యులుగా ఉంటారు.

కో- ఆర్డినేషన్ కమిటీ
53 మందితో ఏర్పాటు చేసిన కో ఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌గా కుంతియా, కన్వీనర్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనుండగా... మిగతా అన్ని కమిటీల చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

ప్రచార కమిటీ
క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా మల్లు భట్టి విక్రమార్క నియమితులు కాగా.. కో- చైర్‌పర్సన్‌గా డీకే అరుణ, కన్వీనర్‌గా దాసోజు శ్రవణ్ వ్యవహరించనున్నారు. వీరితో పాటుగా మరో 14 మంది సభ్యులు ఉంటారు.

ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ
ఈ కమిటీకి ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు నేతృత్వం వహిస్తారు. ఇందులో 41 మంది సభ్యులు, మరో 11 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు.

మేనిఫెస్టో కమిటీ
కమిటీ చైర్మన్‌ : మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ
కో- చైర్‌పర్సన్‌ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కన్వీనర్‌ : బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్
వీరితో పాటుగా మరో 32 మంది సభ్యులు కూడా ఉంటారు.

స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ
కమిటీ చైర్మన్‌ : వి. హనుమంతరావు,
కో- చైర్‌పర్సన్లు : సర్వే సత్యనారాయణ, మధుయాష్కి గౌడ్, శ్రీధర్ బాబు,
కన్వీనర్‌ : పొంగులేటి సుధాకర్ రెడ్డి
మరో 15 మంది కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

ఎల్డీఎంఆర్సీ కమిటీ
చైర్మన్‌ : ఆరెపల్లి మోహన్
కో- చైర్‌పర్సన్‌ : డి. రవీందర్ నాయక్
కన్వీనర్‌ :  హెచ్. వేణుగోపాల్ రావు

ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ
చైర్మన్‌ : మర్రి శశిధర్ రెడ్డి
కో- చైర్‌పర్సన్‌ :  కమలాకర్ రావు
కన్వీనర్‌ :  జి. నిరంజన్
వీరితో పాటుగా మరో ఆరుగురు సభ్యులు

డిసిప్లినరీ యాక్షన్ కమిటీ
చైర్మన్‌ : ఎం. కోదండరెడ్డి
కో- చైర్‌పర్సన్‌ : ఎ. శ్యాంమోహన్
కన్వీనర్లు : బి. కమలాకర్ రావు, నంది ఎల్లయ్య, సంభాని చంద్రశేఖర్, పి. బలరాం నాయక్, సీజే శ్రీనివాసరావు

మరిన్ని వార్తలు