‘ఆ ముఖ్యమంత్రి జైలుకెళ్లడం ఖాయం’

15 Jun, 2019 18:02 IST|Sakshi

చండీగఢ్‌: మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌పై శిరోమణి అకాలీదళ్ నేత మంజీందర్ సింగ్ సిర్సా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌లా ఆయన కూడా జైలుకెళ్లడం ఖాయమని సిర్సా పేర్కొన్నారు. 1984 సిక్కుల ఊచకోత కేసును మళ్లీ తెరిచి తాజాగా విచారణ చేపట్టాలంటూ కేంద్ర హోంశాఖ సిట్‌ను ఆదేశించిన నేపథ్యంలోనే సిర్సా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజా విచారణ పూర్తై, ఈ కేసులో కమల్‌నాథ్ నిందితుడని తేలితే ఆయన కటకటాలు లెక్కించడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ను నియమించడంపై గతంలోనే సిర్సా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సిక్కులను చిత్రహింసలకు గురిచేసిన వ్యక్తిని సీఎంగా ఎలా నియమిస్తారని ఆయన బహిరంగంగానే విమర్శించారు. ఇందిర మరణాంతరం జరిగిన ఘటనతో కమల్‌నాథ్‌ హస్తం కూడా ఉందని ఎంతోకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసును మరోసారి విచారించాలంటూ కేంద్ర హోంశాఖ తాజాగా సిట్‌ను ఆదేశించడంతో మరోసారి తెరపైకి వచ్చింది.  కాగా సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు విధిస్తూ డిసెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు