సాక్షి, హైద్రాబాద్ : ట్రిపుల్ తలాక్ బాధితులకు అండగా ఉంటామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇతర మహిళల గురించి తర్వాత మాట్లడవచ్చు గానీ.. మోదీ తన భార్యకు ఏ హక్కులు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ మోదీ.. మీరు ముస్లిం సోదరీమణులు, కూతుళ్ల విడాకుల గురించి నిజంగా చాలా బాధపడుతున్నారు. కానీ మీ భార్యకు అసలు ఒక్క హక్కునైనా కల్పించారా’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
డీఆర్డీఓ ఇక్కడే ఉంది..
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పర్యటనలో భాగంగా హైద్రాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. హైద్రాబాద్ అభవృద్ధికి మజ్లిస్ అడ్డుపడుతోందంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అక్బరుద్దీన్ ఒవైసీ..‘ ఈరోజు చాయ్వాలాలు, చౌకీదార్లు మజ్లిస్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్లకి చాయ్ చేయడం తప్ప ఇంకో విషయం తెలియదు. మిషన్ శక్తి విజయవంతం కావడానికి కారణమైన డీఆర్డీఓ హైద్రాబాద్లోనే ఉందన్న విషయం మోదీ గుర్తుపెట్టుకుంటే మంచిది’ అని హితవు పలికారు.