రాహుల్‌ సరైన నిర్ణయం తీసుకున్నారు: అఖిలేష్‌

26 Jan, 2019 17:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీని ఉత్తర్‌ప్రదేశ్‌ తూర్పు ప్రాంతం ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా నియమించడంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సరైన నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. ‘యువతకు అవకాశం ఇవ్వడాన్ని సమాజ్‌వాదీ పార్టీ స్వాగతిస్తుంది. ప్రియాంకను కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం శుభపరిణామం. ఈ నిర్ణయం కాంగ్రెస్‌ పార్టీకి కలిసిరావాలని కోరుకుంటున్నా. ప్రియాంకను ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా నియమించిన పార్టీ చీఫ్‌ రాహుల్‌గాంధీకి అభినందనలు’ అని అఖిలేష్‌ అన్నారు. (అక్కడ కాంగ్రెస్‌ను అందుకే పక్కనపెట్టాం)

రానున్న ఎన్నికలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రియాంకను ప్రత్యేక్ష రాజకీయాల్లోకి దించింది. మాటమాత్రమైనా చెప్పకుండా...తమను అసలు పరిగణనలోకే తీసుకోకుండా సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్పీ) బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)లు కూటమిగా ఏర్పడటాన్ని చూసి డీలా పడిన కాంగ్రెస్‌ శ్రేణులకు ప్రియాంక రంగప్రవేశం నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక నియామకంతో యూపీ, ఇతర హిందీ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా స్టార్‌ క్యాంపెయిన్‌ర్‌గా ఆమె సేవలను వాడుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది.

మరిన్ని వార్తలు