కటౌట్
ఫుట్బాల్ అంటే ఆయనకి ఆరో ప్రాణం. పొలిటికల్ గ్రౌండ్లో తన రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థుల్ని ఫుట్బాల్ ఆడేస్తారు. మల్లయోధుడైన కన్నతండ్రి ములాయంసింగ్ యాదవ్ను మట్టికరిపించి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆయనే సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. యువతరం ఆయనలో దూకుడు స్వభావాన్ని ఇష్టపడితే, ఆయనంటే గిట్టనివారు దుందుడుకు స్వభావం అంటూ నిందిస్తారు. గూండారాజ్. దాదాగిరీకి మారుపేరుగా మారిన ఎస్పీలో వాటిని కాస్తో కూస్తో చెరిపేసి పార్టీకి కొత్త హంగులు తీసుకువచ్చిన వాడు అఖిలేష్ యాదవ్ అని చెప్పడానికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.
♦ 1973, జులై 1న ములాయం, మాలతి దంపతులకు జన్మించారు.
♦ రాజస్తాన్ ధోల్పూర్ మిలటరీ స్కూలులో చదవడం అఖిలేశ్కు క్రమశిక్షణను నేర్పింది
♦ ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చాక, లక్నో యూనివర్సిటీలో చదువుతున్న డింపుల్తో అనుకోకుండా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తండ్రి ములాయం వారి ప్రేమను అంగీకరించికపోయినప్పటికీ డింపుల్నే పెళ్లాడతానని పట్టుపట్టారు.
♦ పర్యావరణం ఆయనకు ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్. కర్ణాటకలోని మైసూరు ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఎన్విరాన్మెంట్లో డిగ్రీ చేశారు.
♦ చివరికి తొమ్మిదేళ్ల ప్రేమాయణం తర్వాత 1999, నవంబర్ 24న డింపుల్ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి.
♦ రాజకీయాల్లోకి వచ్చాక వరుసగా మూడుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు.
♦ 2012 మార్చి 10న సమాజ్వాదీ పార్టీ యూపీ శాఖ పగ్గాలు చేపట్టారు.
♦ అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేసి ప్రజా సమస్యలపై అవగాహనే కాదు, యువతరంలో ఫాలోయింగ్నూ పెంచుకున్నారు. బీఎస్పీపై తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించి విజయం సాధించారు.
♦ 38 ఏళ్ల వయసులోనే ఉత్తరప్రదేశ్కు అత్యంత పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి అయ్యారు.
♦ 1990లో ఆస్ట్రేలియాలో సిడ్నీలో పర్యావరణంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.
♦ అయిదేళ్ల పాలనలో తన ముద్ర కనిపించేలా చేశారు. గ్రామీణ అభివృద్ధిపైనే అత్యధికంగా దృష్టి పెట్టి రైతు సంక్షేమానికి కృషి చేసి యూపీ ముఖచిత్రాన్నే మార్చేశారు. ఒక పర్యావరణ ఇంజనీర్గా నీటి కాలుష్యాన్ని అరికట్టడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు.
♦ ప్రజల్లో కూడా అఖిలేష్ మంచి పరిపాలకుడు అన్న పేరు తెచ్చుకున్నారు.
♦ 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుటుంబంలో చోటుచేసుకున్న అంతర్గత కలహాలను సమర్థంగా ఎదుర్కొన్నారు. కన్నతండ్రిని కూడా లెక్కచేయకుండా మొండిగా వ్యవహరించారు. తండ్రి ములాయం, చిన్నాన్న శివపాల్ సింగ్ యాదవ్ను పక్కన పెట్టేసి తానే పార్టీకి జాతీయ అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ కుటుంబ సభ్యులందరూ ఏకమయ్యారు.
♦ రెండోసారి గెలుపు కోసం 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 10 వేల కిలోమీటర్లు తిరిగారు. 800 ర్యాలీలు నిర్వహించారు. కానీ నరేంద్ర మోదీ హవా ముందు నిలబడలేక ఓటమి పాలయ్యారు.
♦ తండ్రి ములాయం వద్దని ఎంత వారిస్తున్నావినకుండా రాష్ట్రంలో ఉప్పు నిప్పుగా ఉన్న బీఎస్పీతో ఈ ఎన్నికల్లో జతకట్టారు. పైపైచ్చు బీఎస్పీకే ఒక సీటు అధికంగా ఇచ్చి మోదీని ఓడించడమే తన లక్ష్యమని చాటారు.