బీజేపీ మోసపూరిత హామీల పార్టీ : అఖిలేష్‌

22 Apr, 2019 19:15 IST|Sakshi

లక్నో : బీజేపీని భారతీయ జుమ్లా పార్టీగా ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ అభివర్ణించారు. మోసపూరిత హామీలతో బీజేపీ ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. బీజేపీ వల్లే దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయన్న ఆపార్టీ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. దేశ భద్రతతో చెలగాటమాడుతున్న బీజేపీ అన్నింటినీ రాజకీయం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన సాహస జవాన్ల కారణంగానే దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయనేది వాస్తవమని అఖిలేష్‌ అన్నారు.

ఎస్పీ, బీఎస్పీ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ లఖింపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ బీజేపీని దుయ్యబట్టారు. ఛాయ్‌వాలా అని చెప్పుకుంటూ 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఇప్పుడు కాపలాదారుగా మారారని ఎద్దేవా చేశారు. ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీ కూటమి మాయాకూటమి అయితే మరి 38 పార్టీలతో కూడిన ఎన్డీఏను ఏ పేరుతో పిలవాలని అఖిలేష్‌ ప్రశ్నించారు. వాస్తవ అంశాల నుంచి బీజేపీ దేశం దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

మరిన్ని వార్తలు