ఇన్నాళ్లు కల్పనగా భావిస్తూ వస్తున్న మంచుమనిషి యతి పాదముద్రలను పోలిన గుర్తులు తమకు కనిపించాయంటూ భారత ఆర్మీ ట్విటర్లో చేసిన ప్రకటన.. పెద్ద సంచలనమే రేపుతోంది. పెద్ద ఎలుగుబంటి ఆకారంలో భారీ కాయంతో మనిషిని పోలినట్టు ఉండే యతి గురించి ఇప్పటివరకు మన పురాణాల్లో, జానపద కథల్లో వినిపించేది. కానీ, తాజాగా ఏకంగా భారత సైన్యమే ఇందుకు సంబంధించిన ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఈ అంశంపై జోకులు, పొలిటికల్ సెటైర్లు కూడా పేలుతున్నాయి. ఈ క్రమంలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తనదైన శైలిలో యతిని ఉపయోగించుకుంటూ.. ప్రధాని నరేంద్రమోదీపై చకిలిగింతలు పెట్టే వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. అత్యంత అరుదుగా కనిపించే యతి కూడా ఆఖరికి కనిపించింది కానీ, గత ఎన్నికల్లో మోదీ ప్రవచించిన ‘అచ్చె దిన్’ (మంచిరోజులు) కనుచూపు మేరలో కనిపించడం లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. అఖిలేశ్ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక సైన్యమే యతి ప్రస్తావన తేవడంతో మిగిలిన ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని వాడుకునేందుకు బీజేపీ తెరవెనుక కసరత్తు ప్రారంభించి ఉంటుందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. మొత్తానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ మొత్తం ఈ యతి గురించే సాగుతోంది.