బంగారు తెలంగాణ అంటూనే మహిళలకు అవమానం

20 Oct, 2018 02:46 IST|Sakshi

బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ

సాక్షి, హైదరాబాద్‌: బంగారు తెలంగాణ అంటూనే రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అవమాన పరుస్తోందని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సద్దుల బతుకమ్మ అంటే తెలంగాణ ఆడపడుచులకు గొప్ప పండుగ అని, అలాంటి పండుగ రోజున చార్మినార్‌లో బతుకమ్మ ఆడేందుకు వచ్చిన మహిళలను పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు.

బంగారు తెలంగాణ అంటూనే పండుగ రోజున మహిళలను అరెస్టు చేసి అవమానించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఎంఐఎం జేబు రుమాలుగా ఎందుకు మారిపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహిళలు అంటే ఎందుకు అంత చిన్న చూపు అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేబినెట్‌లో ఒక్క మహిళకు అవకాశం ఇవ్వకపోయినా ఊరుకున్నామని, కానీ పండుగ రోజున మహిళలను అవమానించడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో సహించమని హెచ్చరించారు.

బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ భారతీయ జన తా పార్టీ ఎన్నికల కమిటీ ఏర్పాటైంది. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన నేతలు సభ్యులను ఎంపిక చేశారు. ఈ కమిటీకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా డాక్టర్‌ లక్ష్మణ్, మురళీధర్‌రావు, శ్రీ పేరాల శేఖర్‌రావు, కిషన్‌ రెడ్డి, రామచంద్రరావు, ఇంద్రసేనారెడ్డి, జి.రామకృష్ణారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, ఇ. లక్ష్మీనారాయణ, మంత్రి శ్రీనివాసులు, చింతా సాంబమూర్తి, నగురావు నమాజీ, ఆకుల విజయ, చందా లింగయ్య దొరను ఎంపిక చేశారు.

మరిన్ని వార్తలు