తెలంగాణ టీడీపీకి మరో షాక్‌

12 Dec, 2017 17:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ టీడీపీకి దెబ్బమీద దెబ్బలు తగులుతున్నాయి. సీనియర్‌ నాయకులు వరుసగా సైకిల్‌ పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి లాంటి అగ్రనేతలు టీడీపీ నుంచి బయటకు వచ్చారు. మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి కూడా టీడీపీని వదిలిపెట్టేందుకు సిద్ధమయ్యారు. తన కుమారుడు సందీప్‌రెడ్డితో కలిసి అధికార టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరిరువురు మంగళవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలిశారు. టీఆర్‌ఎస్‌లో చేరాలని వీరిని సీఎం కేసీఆర్‌ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ నెల 14న ఉమా మాధవరెడ్డి, సందీప్‌రెడ్డి పార్టీ మారనున్నారని సమాచారం.

రేవంత్‌ రెడ్డితో పాటు ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని గతంలో ప్రచారం జరిగింది. స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరలేదని, టీఆర్ఎస్‌లోకి రమ్మని ఆహ్వానిస్తే ఆలోచిస్తానని ఆమె అప్పుడు చెప్పారు. ఏ పార్టీలో చేరినా, తన కుమారుడి వెంట ఉంటానని ఉమా మాధవరెడ్డి అన్నారు. తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు