అన్ని పార్టీల నేతలు టచ్‌లోఉన్నారు: లక్ష్మణ్‌

14 Jun, 2019 17:58 IST|Sakshi

పార్టీ సిద్ధాంతాలు నచ్చినవారిని ఆహ్వానిస్తాం

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అన్ని పార్టీల నుంచి నేతలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ సిద్ధాంతాలు నచ్చినవారిని ఆహ్వానిస్తామని అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో పలువురు బీజేపీ సీనియర్లతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సీనియర్ల సలహాలు, ఆశీస్సులు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఎల్‌కే అద్వానీ, కేంద్ర మాజీమంత్రి సుష్మాస్వరాజ్‌తో దీనిపై చర్చించినట్లు వెల్లడించారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించినందుకు పార్టీ పెద్దలు అభినందంచారని లక్ష్మణ్‌ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ  ఎదుగుదలకు పూర్తిగా సహకరిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. 

సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అద్వానీ సహా పలువురు నేతలను కలిశాం. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సీనియర్ నేతల ఆశీస్సులు తీసుకున్నాం. తెలంగాణ రావాలని కూడా అద్వానీ ని కోరాం. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చాలా నిధులు కేటాయించింది.కేంద్రం ఆయుష్మాన్ భారత్ కింద పేదలకు వైద్య సహాయం అందిస్తోంది. ఆరోగ్య శ్రీ బకాయిలు పెరుకుపోయాయి. లక్షా 80 వేల కోట్లకు రాష్ట్రాన్ని కేసీఆర్ చేర్చారు. తెలంగాణలో ఈబీసీ 10 రిజర్వేషన్లు కేసీఆర్ అమలు చేయడం లేదు. వారికి ఒవైసీ కోసం ముస్లిం రిజర్వేషన్లు కావాలి. ఈబీసీ లకు 10 శాతం రిజర్వేషన్లు తెలంగాణలో అమలు చేసేలా బీజేపీ పోరాటం చేస్తుంది. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఐఆర్, సీపీఎస్ రద్దు వంటివి చేస్తే ఇక్కడ కేసీఆర్ ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదు. మోదీ విధానాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తాం’’ అని అన్నారు.


 

మరిన్ని వార్తలు