రాష్ట్రం అట్టుడుకుతుంటే బాబు దుబాయ్‌ వెళ్తారా?

9 Feb, 2018 02:32 IST|Sakshi
అంబటి రాంబాబు

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి ధ్వజం

అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలంతా రోడ్డెక్కితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు విమానం ఎక్కి దుబాయ్‌ పర్యటనకు వెళ్లారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు బాధ్యతా రాహిత్యంతోనే రాష్ట్రానికి ఈ గతి పట్టిందని మండిపడ్డారు. హక్కుల సాధన కోసం రాష్ట్రం అట్టుడికి పోతుంటే పెట్టుబడుల కోసమంటూ బాబు విదేశాల కెళ్లడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

బీజేపీతో మిత్రపక్షంగా ఎందుకున్నారని అడిగినప్పుడు రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావడానికే అని చెప్పిన చంద్రబాబు.. నాలుగేళ్లలో ఏమి సాధించారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నీళ్లు, హక్కులు ఒక్కటీ సాధించలేక పోయాడని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌లో పాల్గొన్న వారందరికీ పార్టీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.   

మరిన్ని వార్తలు