సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దోచుకున్న అక్రమ సంపాదన లెక్కలు చూసుకుని దాచుకునేందుకే సీఎం చంద్రబాబు కుటుంబంతో మాల్దీవుల పర్యటనకు వెళ్లారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. చివరకు పేదలకు పంపిణీ చేసే చంద్రన్న కానుకల్లోనూ దోపిడీకి తెర తీశారని ధ్వజమెత్తారు.
మంగళవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో చంద్రన్న కానుక కింద నాసిరకం సరుకులు ఇచ్చి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన టీడీపీ సర్కారు ఈ ఏడాది రూ. 450 కోట్లు వెచ్చించడం వెనక వంద కోట్ల అవినీతి దాగి ఉందని చెప్పారు. హోల్సేల్ మార్కెట్ రేట్ల కంటే అత్యధిక ధరలు చెల్లించి బడా వ్యాపారుల నుంచి చంద్రన్న కానుక సరుకులు కొంటున్నారని చెప్పారు.