‘వాటిని ఎల్లో మీడియా ఎందుకు రాయడం లేదు?’ 

28 Jan, 2020 14:13 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: శాసనమండలి రద్దు అంధ్రప్రదేశ్‌ అభివృద్దికి దోహదపడుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు కాంగ్రెస్‌ పార్టీ సీఎంగా వైఎస్సార్‌ శాసనమండలి ఏర్పాటు చేశారని గుర్తు చేసిన అంబటి.. అదే సమయంలో చంద్రబాబు మాట్లాడింది ఎల్లో మీడియా ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. 

‘నిన్న(సోమవారం) జరిగిన శాసన మండలి రద్దు ఒక కీలకమైన తీర్మానం. 1983లో నాడు ఎన్టీఆర్‌ తీసుకున్న నిర్ణయమే తిరిగి నేడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్నారు. కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా సభకు రాలేదు. ఇది మీ తప్పు కాదా? కౌన్సిల్‌కు శాసన పరిమితులు ఉన్నాయి. వాటిని ధిక్కరిస్తే ఏమి జరుగుతుందో.. నిన్నటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఏడు నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వాన్ని రద్దు చేయమని ఎలా అడుగుతారు? మీకు (చంద్రబాబు)కు అంత ఉబలాటమే ఉంటే మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలచే రాజీనామా చేయించండి. ప్రజాతీర్పును తీసుకొని రండి. 

అసెంబ్లీ సాక్షిగా ప్రదర్శించిన చంద్రబాబు నాడు-నేడు మాట్లాడిన వీడియోల ద్వారా ఆయనేంటో రాష్ట్ర ప్రజలకు తెలిసింది. అయితే చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా సీఎం జగన్‌పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీ లాక్కొని వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా? నీ తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావును మోసం చేసింది వాస్తవం కాదా? నీ కొడుకు లోకేష్‌ రాజకీయ వారసుడు కావాలని, అసలైన ఎన్టీఆర్‌ వారసులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడుని కూడా అన్యాయం చేశావు. లోకేష్‌ కోసం ఇన్ని ఘోరాలు చేశావు. భవిష్యత్‌లో మరిన్ని ఘోరాలు చేయడానికి వెనకాడవు. సీఎం జగన్‌పై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశామని చంద్రబాబు వ్యాఖ్యలు అవాస్తవం. వైఎస్సార్‌ సీపీ విధానాలు అవి కావు’అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. 

చదవండి: 
‘రద్దును ఆనందంగా స్వీకరిస్తున్నాం’

ప్రజా ప్రయోజనాల కోసమే..

‘రద్దును ఆనందంగా స్వీకరిస్తున్నాం’

>
మరిన్ని వార్తలు