ప్రజాస్వామ్యానికి ప్రమాదం చంద్రబాబే 

28 May, 2020 04:36 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజం

ప్రతిపక్ష నేత హోదాను కూడా సక్రమంగా నిర్వర్తించట్లేదు

రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదు

టీడీపీ పతనమవుతున్న రాజకీయ పార్టీ 

సాక్షి, అమరావతి: టీడీపీ నిర్వహిస్తున్న మహానాడులో ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు గత ఎన్నికల్లో ఎందుకు ఘోరంగా ఓడిపోయారో ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు ఏ కోశానా లేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో టీడీపీతోపాటు చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ ఘోర పరాజయం పాలయ్యారని గుర్తు చేశారు. చంద్రబాబుకు అధికార కాంక్ష తప్ప రాష్ట్రంపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించి లబ్ధి పొందాలన్నదే ఆయన తాపత్రయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా  ఏమన్నారంటే..  

► సింగపూర్, మలేషియాలతోపాటు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని రాజధానిని నిర్మిస్తున్నానన్న అమరావతి ప్రాంతంలోనే మంగళగిరిలో చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ ఓడిపోయి సంవత్సరం పూర్తైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే ముందు చంద్రబాబు ఈ అవమానకర ఓటమిపై ఎందుకు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు?  
► ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు చంద్రబాబు ఆలోచించాలి. 23 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు టీడీపీ నుంచి తప్పుకున్నారు. మరికొందరు కూడా పోతున్నారని మీడియా ద్వారా తెలుస్తోంది. 
► ప్రజలు చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే దాన్ని కూడా సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. రాష్ట్రం కష్టాల్లో ఉండి కరోనాతో ప్రజలు బాధపడుతున్నప్పుడు 65 రోజులపాటు హైదరాబాద్‌లోని స్వగృహంలో దాక్కున్నారు.  
► ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి టీడీపీ నేతలకు లేదు. టీడీపీ పతనమవుతున్న రాజకీయ పార్టీ. మహానాడులో టీడీపీ పతనంపై ఆత్మవిమర్శ చేసుకోవాలి.  
► ప్రజాస్వామ్యానికి ప్రమాదం తెచ్చింది.. చంద్రబాబే. గతంలో ఆయన దుర్మార్గంగా పాలన సాగించారు. 
► చంద్రబాబు పాలనలో టీడీపీ శ్రేణులకే సంక్షేమ పథకాలు అందాయి.   
► వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కుల, మత, రాజకీయ పార్టీలకతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 
► కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను కేంద్రం కూడా ప్రశంసిస్తోంది.  

మరిన్ని వార్తలు