‘చంద్రబాబు పెయిడ్‌ ఆర్టిస్టులా పవన్‌’

15 Sep, 2019 15:20 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంద రోజుల పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసేలా సీఎం జగన్‌ పాలన సాగుతుందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరులకు వత్తాసు పలికేలా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

జనసేన పార్టీ ఇచ్చిన నివేదిక చూస్తుంటే పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు కలిసి కూర్చొని రాసినట్లుగా ఉందని విమర్శించారు. పవన్‌ మేనిఫెస్టో 22 పేజీలు ఉంటే.. ఆయన సీఎం జగన్‌ పాలనపై ఇచ్చిన నివేదిక 33 పేజీలు ఉందని ఎద్దేవా చేశారు. తాము 100 ఏళ్లు పరిపాలన చేసినా చంద్రబాబు, పవన్‌ తమకు మంచి సర్టిఫికేట్‌ ఇవ్వరని తెలిపారు. చంద్రబాబు పెయిడ్‌ ఆర్టిస్టులా పవన్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరినో ఓడించడానికే జనసేన పార్టీ పుట్టింది కానీ సొంతంగా అధికారంలోకి రావడానికి కాదన్నారు. జనసేన స్వయం ప్రకాశక పార్టీ కాదని, వేరే వారి ప్రకాశం కోసం మాత్రమే పని చేస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అక్రమ కట్టడాలపై పవన్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సీఎం జగన్‌కు చంద్రబాబు, పవన్‌ల సర్టిఫికేట్‌ అవసరం లేదని, ప్రజల సర్టిఫికేట్‌ ఉంటే చాలన్నారు. అవినీతిరహిత పాలన అందించేందుకు కృషి చేస్తున్నామని  అంబటి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు