హిమంత బిశ్వాను పక్కన పెట్టిన బీజేపీ

22 Mar, 2019 11:41 IST|Sakshi

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లిస్ట్‌లో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వాణీతో పాటు అస్సాం బీజేపీ సీనియర్‌ నాయకుడు హిమంత బిశ్వా శర్మ పేరు కూడా లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ట్రబుల్‌ షూటర్‌గా పేరు పొందిన హిమంత బిశ్వాకు టికెట్‌ కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా హిమంతకు టికెట్‌ కేటాయించకపోవడం వెనక గల కారణాలను ట్విటర్‌ ద్వారా తెలిపారు.

ఈ విషయం గురించి ఆయన ‘ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రస్తుతం హిమంత బిశ్వా శర్మ నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్‌డీఏసీ) కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అస్సాం, ఈశాన్య రాష్ట్రల్లో పార్టీని బలపర్చడం ముఖ్యం. ఈ బాధ్యతలను హిమంత బిశ్వా చక్కగా నిర్వర్తిస్తారని పార్టీ నమ్ముతుంది. అందుకే ఆయనకు టికెట్‌ కేటాయించలేదు. అస్సాం బీజేపీ శ్రేణులతో పాటు ఈశాన్య రాష్ట్రాల బీజేపీ నేతలు కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తారని ఆశిస్తున్నాను. ఈ నిర్ణయం వల్ల అస్సాంతో పాటూ ఈశాన్య భారతం కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానం’టూ అమిత్‌ షా ట్విట్‌ చేశారు. ప్రస్తుతం బిశ్వా అస్సాం ఆర్థిక మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు