సాక్షి, న్యూఢిల్లీ : ఈవీఎంలపై విపక్షాల తీరును బీజేపీ చీఫ్ అమిత్ షా తప్పుపట్టారు. ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఒక రోజు ముందు ఓ జాతీయ పార్టీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎలా ప్రశ్నిస్తుందని ఆయన నిలదీశారు. ఈవీఎంలను అవమానించడం దేశ ప్రజలను అవమానించడమేనని అమిత్ షా మండిపడ్డారు. కాగా ఈసీ బీజేపీ మార్గదర్శకాలను అనుగుణంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ విమర్శల దాడి తీవ్రం చేసింది.
ఈసీ పాలక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి వ్యాఖ్యానించారు. ఓట్ల లెక్కింపు రోజు ముందుగా ఆయా నియోజకవర్గాల్లో 5 వీవీప్యాట్ల లెక్కింపును చేపట్టాలన్న 22 విపక్ష పార్టీల విజ్ఞప్తిని ఈసీ తిరస్కరించిన నేపథ్యంలో ఈసీ తీరును విపక్ష పార్టీలు తప్పుపట్టాయి. కాగా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభం కానుంది.