విశాఖ వికాసం కమలంతోనే సాధ్యం

5 Apr, 2019 13:06 IST|Sakshi
కంచరపాలెంలో ప్రచార రథంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, తదితర నాయకులు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా

కంచరపాలెం బీఆర్‌టీఎస్‌ కారిడార్‌లో రోడ్డు షో

కంచరపాలెం(విశాఖ ఉత్తర): కమలంతో విశాఖ వాసులకు వికాసం ఉంటుందని, దేశ ప్రజలను స్వచ్ఛత వైపు నడిపించేందుకు బీజేపీకి మరో అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం సాయంత్రం కంచరపాలెం బీఆర్‌టీఎస్‌ కారిడార్‌లో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో బీజేపీ దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని, మరింత అభివృద్ధి పథానికి ప్రజలు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. కమలం గుర్తుకు ఓటు వేయాలన్నారు. విశాఖ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిని లోక్‌సభకు పంపే బాధ్యత విశాఖ ప్రజలదేనన్నారు. రాష్ట్ర అసెంబ్లీకి కూడా విశాఖ నగరంలోని పార్టీ అభ్యర్థులను గెలిపించి పంపించాలన్నారు. ఊర్వశి కూడలి జాతీయ రహదారి నుంచి కంచరపాలెం నేతాజీ ఫ్లైఓవర్‌ కూడలి వరకు ఈ రోడ్డు షో సాగింది. బీజేపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి బుద్దా చంద్రశేఖర్, ఎమ్మెల్సీ మాధవ్, గాజువాక అభ్యర్థి పులుసు జనార్దనరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు