ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు: అమిత్‌ షా

3 Mar, 2019 01:25 IST|Sakshi

ఉమారియా(మధ్యప్రదేశ్‌): బాలాకోట్‌లో ఉగ్రవాద సంస్థ శిక్షణ శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన వైమానిక దాడుల్ని ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదని, ప్రతిపక్షాల తీరు భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. వైమానిక దాడులపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తూ పాకిస్తాన్‌కు వంత పాడుతున్నాయని అమిత్‌ షా ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని ఉమారియాలో విజయ సంకల్ప పేరుతో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మోటార్‌ బైక్‌ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓవైపు భారత సైనిక దళాలు మీడియా సమావేశం నిర్వహించి పాక్‌ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేసి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టామని చెబుతుంటే ప్రతిపక్షాలు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నాయన్నారు. భారత సైన్యం ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా విమర్శిస్తూ చిల్లర రాజకీయాలు చేయొద్దన్నారు. భారత్‌ వింగ్‌కమాండర్‌ అభినందన్‌ తిరిగి మాతృదేశానికి చేరుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 
 

మరిన్ని వార్తలు