సాక్షి, అమరావతి : అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఆమోదం తెలిపింది. సోమవారం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాలు రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి. సుధీర్ఘ చర్చల అనంతరం ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ.. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులకు శాసన సభ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం పరిపాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా బిల్లు ఆమోదం పొందింది. అనంతరం సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును సైతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సహా అధికార పార్టీ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఈ బిల్లులు ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెట్టి సభకు పరిచయం చేసే అవకాశం దక్కడం అదృష్టంగా పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్సించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు.