ఇది చంద్రబాబు కడుపు మంట

7 Sep, 2019 19:19 IST|Sakshi

ఉప ముఖ్యమంత్రులు బోస్, పుష్ప శ్రీవాణి, నాని, నారాయణస్వామి, అంజాద్‌ ధ్వజం

పింఛన్ల పెంపు, ఉద్యోగులకు ఐఆర్, విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌ మెంట్, గ్రామ వలంటీర్లు, రైతులకు మేలు చేసే నిర్ణయాలు, యువతకు ఉద్యోగాలు, పలు కంపెనీల ఏర్పాటును తప్పుపడుతున్నారంటే ఇవన్నీ మీకు ఇష్టం లేదనే కదా?
– టీడీపీకి ఉప ముఖ్యమంత్రుల ప్రశ్న

సాక్షి, అమరావతి : చెరువులో చేప ఒడ్డున పడితే ఎలా గిలగిల లాడుతుందో అధికారం కోల్పోయిన టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉందని ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్‌చంద్ర బోస్, పాముల పుష్పశ్రీవాణి, ఆళ్ల నాని, కళత్తూరు నారాయణస్వామి, షేక్‌ బేపారి అంజాద్‌ బాషలు మండిపడ్డారు. ప్రజా రంజకంగా సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పరిపాలనపై కరపత్రం విడుదల చేసి లేని పోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నుంచి అర్ధంతరంగా పారిపోయి వచ్చిన తుగ్లక్‌ చంద్రబాబు అని, ఆయన ప్రకటించిన చార్జిషీటులో నిజాలేమైనా ఉన్నాయా? అని నిలదీశారు. అధికారం పోయిందన్న కడుపు మంట చంద్రబాబుకు ఎంత ఉందో వారి కరపత్రం చూస్తే తెలుస్తోందన్నారు. ‘నా ఇల్లు ముంచేశారు.. నేను కట్టిన ప్రజా వేదికను కూల్చేశారు..’ అనే రెండు మాటలే మూడు నెలలుగా చంద్రబాబు నోట వెలువడుతున్నాయన్నారు.

టీడీపీ కరపత్రం మొదట్లోనే అక్రమ కట్టడాన్ని కూల్చిన ఫొటో వేశారని వారు తప్పు పట్టారు. అందులోని అంశాల వారీగా స్పందిస్తూ శనివారం వారు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బాబు ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క ఏడాది కూడా శ్రీశైలం, నాగా ర్జున సాగర్, పులిచింతల జలాశయాలు నిండలేదన్న నిజాన్ని కరపత్రంలో ఇవ్వకుండా దాచారని తప్పుపట్టారు. ఆర్టీసీ కార్మికులకు జగన్‌ ప్రభుత్వం మేలు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని పేర్కొ న్నారు. తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ లంచాల కోసం చంద్రబాబు విద్యుత్‌ సంస్థలకు దాదాపు రూ.20 వేల కోట్లు నష్టం తీసుకు వచ్చాడన్న విషయాన్ని మీడియా ఎందుకు రాయడం లేదని వారు ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లకు చంద్రబాబు ప్రభుత్వం పైసా విడుదల చేయలేదని స్పష్టీకరించారు.  

ఈ ప్రశ్నలకు బదులేదీ?

  • అమ్మ ఒడి స్కీం ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? ఐదేళ్లలో బాబు ఏ తల్లికి అయినా రూపాయి ఇచ్చారా?
  • అమరావతిలో రూ.50 వేల కోట్ల పనులు నిలిపివేశారన్నారే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.1500 కోట్లని చెప్పిన చంద్రబాబు మిగతా సొమ్ము ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు? 
  • పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018కే గ్రావిటీపై నీళ్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తామన్న మాట ఏమైంది? టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుందని సాక్షాత్తు దేశ ప్రధాని చెప్పడం నిజం కాదా? 
  • చంద్రబాబు తన అవినీతి బయటపడుతుందని రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని వ్యతిరేకించారు. పోలవరం డ్యాం భద్రత ప్రశ్నార్థకం అయ్యిందని చార్జిషీటులో రాశారు. సిమెంటు, ఇనుముతో చంద్రబాబు పునాదుల నుంచి సవ్యంగా కడితే దాని భద్రతకు ఎలాంటి ముప్పూ ఉండదు. మరి ఆ డబ్బు తినేసి బూడిదతో కట్టారా? 
  • 2014 జూన్‌ 8నే రుణమాఫీ చేసేశామని చంద్రబాబు చెప్పారు కదా? రుణ మాఫీ చేసి ఉంటే బకాయిల ప్రస్తావన ఎందుకొస్తుంది?
  • రూ.87,612 కోట్ల అప్పులను రూ.24,500 కోట్లకు కుదించి చివరకు అందులోనూ రూ.10 వేల కోట్లు ఎగ్గొట్టడం వాస్తవం కాదా?
  • మీరు నిరుద్యోగ భృతి పేరుతో యువతను వంచించడం నిజం కాదా? వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఏకంగా 4.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుండటం నిజం కాదా?
  • అసెంబ్లీ సమావేశాలు పూర్తికాకుండానే అమెరికా పారిపోయిన చంద్రబాబు తనకు మైకు ఇవ్వలేదని ఎందుకు మాట్లాడుతున్నారు? 
  • పింఛన్ల పెంపు, ఉద్యోగులకు ఐఆర్, విద్యార్థులకు వంద శాతం ఫీజు రియింబర్స్‌మెంట్, గ్రామ వలంటీర్లు, రైతులకు మేలు చేసే నిర్ణయాలు, పలు కంపెనీల ఏర్పాటును తప్పుపడుతున్నారంటే ఇవన్నీ మీకు ఇష్టం లేదనే కదా? 
  • ఒక ఉద్యోగి ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన జీవోను పట్టుకుని బందరు పోర్టు తెలంగాణకు ఇచ్చేసే వ్యూహం అంటూ ప్రచారం చేయడం దిగజారుడుతనం కాదా?

ఉప ముఖ్యమంత్రుల ప్రతికా ప్రకటన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు