వైఎస్సార్‌ సీపీకి 135 స్థానాలు: ఆరా సర్వే

19 May, 2019 20:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కుమారుడు, మంత్రి నారా లోకేష్‌బాబు మంగళగిరిలో గెలవటం డౌటేనని ఆరా పోస్ట్‌ పోల్‌ సర్వే వెల్లడించింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ 135 స్థానాలు సాధించే అవకాశం ఉందని ఆరా పోల్స్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన పోస్ట్‌ పోల్ సర్వేలో స్పష్టమైంది. ఆరా సర్వే వివరాలను సంస్థ ప్రతినిధి షేక్‌ మస్తాన్‌ వలి ఆదివారం మీడియాకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆరా సంస్థ అనేక పర్యాయాలు పోస్ట్‌ పోల్స్ నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో 2008 నుంచి ఆరా సంస్థ ఖచ్చితమైన లెక్కలతో సర్వే చేపట్టింది.  2014లో ఆంధ్రప్రదేశ్‌ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినందున అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబునాయుడికి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. 

2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి బీజేపీనుంచి నరేంద్రమోదీ, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ మద్దతు లభించడం వలన అధికారంలోకి రాగలిగారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీకి స్పష్టమైన మెజారిటీ వస్తోంది. వైఎస్సార్‌ సీపీకి 48.78 శాతం, టీడీపీకి 40.18 శాతం, జనసేనకు 7.81 శాతం, ఇతరులకు 3.26 శాతం ఓట్లు పడ్డాయి. ఆంద్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ 22 స్థానాలను గెలుచుకుంటుంది. టీడీపీ 3 స్థానాలు గెలవొచ్చు లేదా ఒకటికే పరిమితం అయ్యే అవకాశం కూడా ఉంది.

పసుపు కుంకుమ పథకం వలన ఆడవారు ఓట్లు టీడీపీకి ఎక్కువగా వేశారని ప్రచారం జరిగింది. కానీ వాస్తవ రూపంలో మహిళల ఓట్లు టీడీపీ కంటే వైఎస్సార్‌ సీపీకే ఎక్కువగా పడ్డాయని మా సర్వేలో తేలింది. మహిళల ఓట్లను పరిశీలిస్తే వైఎస్సార్‌ సీపీకి 48.95 శాతం, టీడీపీకి 45.06 శాతం, జనసేనకు 3.88 శాతం ఓట్లు పడ్డాయి. మగవారి ఓట్ల వివరాలు చూసుకుంటే వైఎస్సార్‌ సీపీకి 50.08 శాతం, టీడీపీకి 30.96 శాతం, జనసేనకు 7.71 శాతం మంది ఓట్లు వేశారు. ఏప్రిల్ 17 నుంచి మే 18 వరకు సిస్టమాటిక్ రాండమ్ శాంపిల్ మెథడాలజీ ద్వారా సర్వే చేపట్టాము. బాలకృష్ణ తక్కువ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. ఆరాకు గల అనుభవం, స్పష్టమైన, ఖచ్చితమైన విలువల ఆధారంగా సర్వే చేపట్టామ’ని మస్తాన్ వలి పేర్కొన్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
ఆరా పోస్ట్ పోల్స్ : వైఎస్సార్‌సీపీకి మెజారిటీ

మరిన్ని వార్తలు