ఖతర్నాక్‌ ఇద్దరు!

3 Apr, 2019 08:28 IST|Sakshi

14 స్థానాల్లో 11 మంది నేర చరితులు

ఖద్దరు వెనుక చీకటి కోణం

ఏరికోరి టిక్కెట్లు కేటాయించిన చంద్రబాబు

తూటాలు దూసుకొస్తున్నాయి.. కత్తులు కరాళనృత్యం చేస్తున్నాయి.. తంతారో, నరుకుతారో మీ ఇష్టం అనే భరోసా. అడ్డూఅదుపులేని ఆర్థిక నేరాలు. ఆనవాలు కూడా దొరకని హత్యలు. పసుపు కండువాలకు అంటుకున్న రక్తపు మరకల్ని కుంకుమ అంటూ మభ్య పెట్టే ప్రయత్నాలు. మహిళల నుదుటన బొట్టును చెరిపేసే.. ఖద్దరు చీకటి కోణాలకు సజీవ సాక్ష్యాలు ఇవిగో. భావి తరాలకు ఎలాంటి సందేశం ఇద్దాం.. ఎవరికి ఓటేద్దాం.. ఆలోచించండి. 

నందమూరి బాలకృష్ణ
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేర చరిత్ర కలిగిన టీడీపీ అభ్యర్థుల్లో ప్రముఖుడు. ఈయనపై నాలుగు కేసులు ఉన్నాయి. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కాల్పులు జరిపి హతమార్చేందుకు యత్నించారు. తీవ్ర రక్తగాయాలు కాగా.. ఒక కిడ్నీ తొలగించారు. అతికష్టం మీద ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఈ కేసు నుంచి బయట పడేందుకు బాలకృష్ణ మానసిక స్థితి బాగోలేదని అప్పట్లో నిమ్స్‌ వైద్యులు సర్టిఫికెట్‌ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పుడు కూడా బాలకృష్ణ తరచూ ఎవరి మీదనో ఒకరిమీద చేయి చేసుకుంటూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు.

పరిటాల శ్రీరాం
రామగిరి పోలీసుస్టేషన్‌లో కిడ్నాప్, హత్యాయత్నం తదితర నేరాల కింద( నెంబర్‌ 57/2018) పరిటాల శ్రీరాంపై కేసు నమోదైంది. ఇదే కాదు రాప్తాడు మాజీ మండల కన్వీనర్‌ ప్రసాద్‌రెడ్డి హత్యకేసులో ఇతని ప్రమేయం ఉందని అప్పట్లో మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేయలేదు. కందుకూరు శివారెడ్డి హత్య శ్రీరాం చేయించారని శివారెడ్డి కుమారుడు స్టేషన్‌లో ఏకంగా ఫిర్యాదు చేశారు. ఇతను రాప్తాడు నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు చంద్రబాబు టిక్కెట్‌ ఇచ్చారు.

కాలవ శ్రీనివాసులు 
రాయదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా బరిలో ఉన్న కాలవ శ్రీనివాసులుపైనా నాలుగు కేసులు ఉన్నాయి. మూడు కేసులు ఉంటే రౌడీషీట్‌ తెరవచ్చు. కాకపోతే అధికారపార్టీ నేత కావడంతో పోలీసులు ఆ దిశగా ముందడుగు వేయలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఈయన మంత్రి.

వరదాపురం సూరి 
ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గోనుగుంట్ల సూర్యనారాయణపై స్థానిక జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ కోర్టులో కేసు(సీసీ నెంబర్‌:48/2014) పెండింగ్‌లో ఉంది. దీన్ని ఇటీవలే విజయవాడ స్పెషల్‌ కోర్టుకు బదిలీ చేశారు. ఈయన ఇటీవల కార్యకర్తల సమావేశంలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఆర్నెళ్ల్ల పాటు ఎవరినైనా చంపేసుకోవచ్చు. కేసులు లేకుండా చూస్తామని భరోసా కల్పించారు. 

కందికుంట ప్రసాద్‌
కదిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందికుంట ప్రసాద్‌పై మొన్నటి వరకు ఏడు కేసులు ఉండేవి. ప్రస్తుతం సీబీఐ కోర్టులో(సీసీ నెంబర్‌2/2003, సీసీ నెంబర్‌ 33/2007) ఓ కేసు నడుస్తోంది. చెక్‌బౌన్స్‌ కేసుల్లో శిక్షపడి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా కోర్టు తీర్పు వెల్లడించింది. ఇటీవలే ఆ తీర్పుపై స్టే తెచ్చుకుని తిరిగి పోటీలో ఉన్నారు. 

‘అనంత’లో ఎలాగైనా ఎన్నికలు గెలవాలనే ఏకైక లక్ష్యంతో ఎన్ని అరాచకాలు చేసేందుకైనా వెనుకాడకూడదని తెలుగుదేశంపార్టీ నిర్ణయించుకుంది. ఆ పార్టీ బరిలో దింపిన అభ్యర్థులను చూస్తే ఈ విషయం బోధపడుతోంది. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు జిల్లాకు ఫలానా మంచి చేసినట్లు చెప్పుకునేందుకు ఒక్కటీ లేదు. శంకుస్థాపనలకు పరిమితమైన సంస్థలు కేంద్రప్రభుత్వానివి!  సిమెంట్‌ రోడ్ల నిధులు ఉపాధిహామీ పథకానికి చెందినవి. చివరకు చంద్రన్నబీమా లాంటి పథకాలు కూడా కేంద్రానివే! తనకంటూ ప్రత్యేకంగా చెప్పుకునే ఒక్క సంక్షేమ పథకాన్నీ చంద్రబాబు అమలు చేయలేకపోయారు. ఇది టీడీపీపై ప్రజావ్యతిరేకతను పెల్లుబికేలా చేసింది. 

నేర చరితులకు టికెట్లు 
ప్రజావ్యతిరేకత వెల్లువెత్తడంతో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమని చంద్రబాబుకు స్పష్టంగా తెలిసిపోయింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆ పార్టీ ఓటు బ్యాంకును దారుణంగా దెబ్బతీసింది. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలు చంద్రబాబుకు సవాల్‌గా మారాయి. ఈ దఫా అధికారంలోకి రాకపోతే రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు కుటుంబం ఉనికి కోల్పోయే ప్రమాదముంది. ఇప్పటికే వయోభారంతో నలిగిపోతున్న చంద్రబాబు.. తన వారసుడి రాజకీయ భవిష్యత్తుపై అంతులేని బెంగతో నలిగి పోతున్నారు. ఆయన వారసుడికి రాష్ట్రంలో ఎంత గొప్ప పేరు ఉందో తెలియంది కాదు. దీంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ధనబలం, కండబలం ఉన్నవారిని పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. 

డబ్బు.. దౌర్జన్యం 
ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం చంద్రబాబు తొలిమార్గం. అందుకు అనుగుణంగానే ఈ ఐదేళ్లు ప్రజలను నిలువునా దోచేసిన సొమ్ములో నుంచి ఓటుకు రూ.2 వేలు నుంచి రూ. 3వేలు పంచేందుకు టీడీపీ అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇక చంద్రబాబు రెండో మార్గం.. డబ్బుకు లొంగని వారిని భయభ్రాంతులకు గురి చేసి లబ్ధి పొందడం. ఇందుకు నేరస్తులైతే సరిపోతారు. ఈ లక్ష్యంతోనే ‘నేరస్తుల టీఎం’ను చంద్రబాబు ఎంపిక చేశారు. టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, వారి పాత నేర చరిత్ర చూస్తే భవిష్యత్తులో వీరు ఎమ్మెల్యేలుగా గెలిస్తే ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు లోపించి సామాన్యులకు కంటిమీద కునుకులేకుండా పోతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.   

ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్థులు పేర్కొన్న నేరచరిత్ర పరిశీలిస్తే..

- హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పపై యు/ఎస్‌ 500 ఐపీసీ కింద  సీసీ నంబరు 48/2014 కేసు అమరావతి ప్రత్యేక కోర్టులో ఉంది. గుంతకల్లు స్పెషల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో యు/ఎస్‌ 174(ఎ), 147 ఆఫ్‌ రైల్వే చట్టం ప్రకారం ఎస్‌టీసీ నంబర్‌ 1477/2013, ఎస్‌టీసీ నంబరు 473/2013, ఎస్‌టీసీ 313/2013 కేసులు ఉన్నాయి.  


 - పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి బీకే పార్థసారథిపై అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రై మ్‌ నంబర్‌ 193/2013 కేసు పెండింగ్‌లో ఉంది. అనంతపురం ప్రిన్సిపల్‌ జుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్టేట్‌ వద్ద సీసీ నెం: 88/2018 పెండింగ్‌లో ఉంది. ఈ కేసులు యూ/సెక్షన్‌ 147, 148, 336, 427, 506, ఆర్‌/డబ్ల్యూ 149 ఐపీసీ కింద నమోదయ్యాయి. 

- నందమూరి బాలకృష్ణపై  బుక్కరాయసముద్రం పోలీసు స్టేషన్‌లో సీఆర్‌.నెం.10/09, గుత్తి పోలీసు స్టేషన్‌లో సీఆర్‌.నెం.20/09, విజయవాడ స్పెషల్‌ కోర్టులో సీసీ 40/18, సీసీ 43/18, విజయవాడ కోర్టులో యూ/ఎస్‌ 188, 283 ఆఫ్‌ ఐపీ, యు/ఎస్‌ 188, 283 ఐపీసీ కేసులు ఉన్నాయి.  

 

- మడకశిర టీడీపీ అభ్యర్థి ఈరన్నపై మడకశిర పోలీస్‌స్టేషన్‌లో అండర్‌ సెక్షన్‌ 171–ఇ, 188 ఆఫ్‌ ఐబీపీ కింద క్రైమ్‌ నెం: 76/2013 కేసు నమోదైంది. మడకశిర జుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టులో సీసీ నెం: 91/2013 ఉన్న ఈ కేసు విజయవాడ స్పెషల్‌ కోర్టుకు (సీసీ నెం: 7/19) బదిలీ అయింది.

- తాడిపత్రి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డిపై ఎలాంటి కేసులు లేవు. అయితే ఇతని తండ్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి గతంలో రౌడీషీటర్‌!  తాడిపత్రి టౌన్‌ పోలీసుస్టేషన్‌లో డిసెంబర్‌ 1, 1993న జేసీ ప్రభాకర్‌రెడ్డిపై 240/ఏఎన్‌ నంబర్‌తో రౌడీషీట్‌ తెరిచారు. ఇతనిపై రౌడీషీటే కాదు పదుల సంఖ్యలో వివిధ పోలీసుస్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. తర్వాత కొట్టేయించుకున్నారు. తన కుమారుడి గెలుపు కోసం ఓటర్లపై రౌడీయిజం చెలాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.   

- ధర్మవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జి.సూర్యనారాయణపై ఐపీసీ 500 కింద సీసీ నెం:48/2014గా ధర్మవరం జుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టులో కేసు ఉంది. ఈ కేసు ఇటీవలనే విజయవాడలోని స్పెషల్‌ కోర్టుకు బదిలీ చేశారు.  

- మంత్రి కాలవ శ్రీనివాసులుపై అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో అండర్‌ సెక్షన్‌ 147, 148, 336, 427, 506, ఆర్‌/డబ్ల్యూ 149 ఐపీసీ కింద క్రైమ్‌ నెం: 193/2013 కేసు నమోదైంది. బుక్కరాయసముద్రం పోలీస్‌స్టేషన్‌లో అండర్‌ సెక్షన్‌ 283, 188 ఐపీసీ కింద క్రైమ్‌ నెం: 10/2009 ఓ కేసు, గుత్తి పోలీస్‌స్టేషన్‌లో అండర్‌ సెక్షన్‌ 283, 188 కింద ( క్రైమ్‌ నెం: 20/2009) మరో కేసు నమోదైంది.  

- కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడుపై  బెళుగుప్ప పోలీస్‌స్టేషన్‌లో అండర్‌ సెక్షన్‌ 143, 188, ఆర్‌/డబ్ల్యూ34 ఆఫ్‌ ఐపీసీ కింద క్రైమ్‌ నెం:62/2019 కేసు నమోదైంది. కళ్యాణదుర్గం ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసులో పీఓఆర్‌ నెం:21/2016–17 మరో కేసు నమోదైంది.  

- పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డిపై అండర్‌ సెక్షన్‌ 188, 283 ఆఫ్‌ ఐపీసీ కింద గుత్తి పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 20/2009 కేసు నమోదైంది.  

- రాప్తాడు అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ మీద రామగిరి పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్‌ నెం: 57/2018 (సెక్షన్లు 363, 324, 384, 342, 307, 506, ఆర్‌/డబ్ల్యూ 34 ఐపీసీ) నమోదైంది. బోయ నారాయణ అలియాస్‌ సూర్యం అనే వ్యక్తిని కిడ్నాప్‌ చేయడంతో పాటు అతనిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.  


- ఉరవకొండ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ మీద బుక్కరాయసముద్రం పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్‌ 10/2009 కేసు నమోదైంది. అనంతపురం మొదటి క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఫర్‌ ఎక్సైజ్‌ అఫెన్స్‌ కోర్టులో ఉన్న ఈ కేసును ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు పరిశీలించే విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. 

- కదిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌పై హైదారాబాద్‌ సీబీఐ కోర్టులో సీసీ నెం:2/2003, సీసీ నెం:33/2007 కేసులు నడుస్తున్నాయి.  


- గుంతకల్లు అభ్యర్థి జితేంద్రగౌడ్‌ మీద గుంతకల్లు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్‌ నెం:99/2005 కేసు నమోదు అయింది.  

మరిన్ని వార్తలు