ఉమాను ఆహ్వనించి.. కొత్త బట్టలు పెడతా: మంత్రి అనిల్‌

5 Feb, 2020 19:51 IST|Sakshi

నేను ఏం చదువుకున్నానో అందరికీ తెలుసు..

నువ్వు ఎవరిని చంపి రాజకీయాల్లోకి వచ్చావో తెలుసుకో

సాక్షి, నెల్లూరు : చంద్రబాబు 14 సంవత్సరాల పాలనలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా అని జలవనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. దమ్ముంటే ఈ విషయంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు. బుధవారం జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అనిల్‌ మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు దోపిడి చేశారని, పోలవరం పేరుతో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. 35 శాతం కూడా పోలవరం పనులు చేయకుండా.. కాంక్రీటులో గిన్నిస్‌ రికార్డులు వచ్చాయని దుష్ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు..

అదే విధంగా టీడీపీ నేత దేవినేని ఉమాపై మంత్రి అనిల్‌ కుమార్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2021 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని.. దానికి దేవినేని ఉమాను కూడా ఆహ్వానిస్తామని.. కొత్త బట్టలు కూడా పెడతామని పేర్కొన్నారు. రివర్స్‌ టెండరింగ్‌లో వెయ్యి కోట్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదా చేశారని, తమ దోపిడి వ్యవహారం బయటకు వస్తుండటంతో తట్టుకోలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తర కుమారుడు అంటే ఎవరో అందరికీ తెలుసని, ఆడా.. మగా కానీ ఉమా.. తనపై విమర్శలు చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. ‘నేను ఏం చదువుకున్నానో అందరికీ తెలుసు.. నువ్వు ఎవరిని చంపి రాజకీయాల్లోకి వచ్చావో తెలుసుకో’ అంటూ ఉమాపై విరుచుకుపడ్డారు.

మరిన్ని వార్తలు