‘బాబు బుర్ర ఎల్లో వైరస్‌తో నిండిపోయింది’

16 Apr, 2020 13:20 IST|Sakshi

మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌

సాక్షి, తాడేపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ఉండి చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఒక్క టీడీపీ నేత అయినా ప్రజలకు సహాయం చేసిన సందర్భం ఉందా అని ప్రశ్నించారు. మంత్రి అనిల్‌కుమార్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై అనవసరపు రాజకీయం చేస్తూ టీడీపీ నేతలు సునకానందం పొందుతు​న్నారని ఆయన మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియం టీడీపీ నేతల కొడుకులు, మనవళ్లు మాత్రమే చదవాలా అని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించే ఎల్లో మీడియా ప్రతినిధుల పిల్లలు, చంద్రబాబు మనవడు ఏ మీడియంలో చదువుతున్నాడో చెప్పాలన్నారు. చంద్రబాబు మనవడిని ఎందుకు తెలుగు మీడియంలో చదివించడం లేదని మంత్రి అనిల్‌కుమార్‌ ప్రశ్నించారు. లోకేష్‌ను ఎందుకు అమెరికాలో చదివించారో చెప్పాలన్నారు. ఇక తన బినామీలు నారాయణ చైతన్య సంస్థలను బతికించడానికి ఇంగ్లీష్‌ మీడియాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం​ వ్యక్తం చేశారు.  (రేపు ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తారు?)

పోటీ ప్రపంచంలో ప్రతి పేదవానికి ఇంగ్లీషు మీడియం అందించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భావించారని  మంత్రి అనిల్‌కుమార్‌ గుర్తు చేశారు.  సీఎం వైఎస్‌ జగన్‌ పబ్లిసిటీకి దూరంగా పని చేస్తున్నారని.. కరోనా వైరస్‌పై ప్రతి రోజు సమీక్ష చేస్తున్నారని ఆయన తెలిపారు. సీఎం జగన్‌ పనితీరును జాతీయ మీడియా సైతం ప్రశంసించిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు మీడియా సమావేశాలు పెట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాశారా అని అడిగితే నిమ్మగడ్డ రమేష్ నోరు మెదపడం లేదన్నారు. డీజీపీకి ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే నిమ్మగడ్డ నోరు విప్పారని, విజయసాయిరెడ్డి అడిగిన మూడు ప్రశ్నలకు నిమ్మగడ్డ ఎందుకు సమాధానం చెప్పలేదని మంత్రి ప్రశ్నించారు. ఆ లేఖను ఎవరు డ్రాఫ్ట్ చేశారో, ఏ ఐడి అడ్రస్ నుంచి మెయిల్ వెళ్లిందో నిమ్మగడ్డ రమేష్ సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు బుర్ర ఎల్లో వైరస్‌తో నిండిపోయిందని మండిపడ్డారు.  ప్రస్తుతం రెండు వేల కరోనా టెస్టులు చేస్తున్నామని, రెండు మూడు రోజుల్లో రోజుకు నాలుగు వేల కరోనా టెస్టులు చేయబోతున్నామని ఆయన వెల్లడించారు.

చంద్రబాబుకు కరోనా వైరస్ వస్తే ప్రభుత్వం దాస్తుందా?  లేదా టీడీపీ నేతలకు వచ్చిన కరోనా కేసులను ప్రభుత్వం దాచి పెడుతుందా? ఎవరికి వచ్చిన కరోనా కేసులు దాచిపెట్టామో చంద్రబాబు చెప్పాలన్నారు. కమ్మవారు తలుచుకుంటే ఎవరు అయిపోరు, ప్రజలు తలుచుకుంటే ఎవరైనా అయిపోతారని అనిల్‌ కుమార్‌ అన్నారు. ప్రజలు తలుచుకున్నారు కాబట్టే చంద్రబాబు, రాయపాటి అయిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి కనీసం 23 సీట్లు వచ్చాయని..  వచ్చే ఎన్నికల్లో 2 లేదా 3 సీట్లు వస్తాయని మంత్రి అనిల్‌ కుమార్‌ అన్నారు.

>
మరిన్ని వార్తలు