చట్టాలు ఉంది ఆచరించడానికే: అసెంబ్లీలో గిద్దలూరు ఎమ్మెల్యే 

31 Jul, 2019 07:42 IST|Sakshi
శాసనసభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు 

సాక్షి, గిద్దలూరు: అసెంబ్లీలో, పార్లమెంటులో సభ్యులు తయారు చేసే చట్టాలు చదువుకునేందుకేనా చట్టాల్ని ఆచరించేందుకు కాదా అని ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో తీసుకోవాల్సిన మార్పులు, గత శాసనసభలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘించారనే విషయాలపై ఆయన మాట్లాడారు. మా నియోజకవర్గంలో వెలిగొండ ప్రాజెక్టును గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.  రూ.600 కోట్లు పనులు రద్దు చేసి, రూ.1,600 కోట్లకు టెండర్లు పెంచారు. కాంట్రాక్టరును మార్చి మెషీన్‌లను వాటితోనే పనిచేస్తున్నారు. 2014లో రూ.10లక్షలు ఇచ్చేందుకు చేతగాని టీడీపీకి 23 మందిని కొట్ల రూపాయలు ఇచ్చి ఎలా కొన్నారన్నారు. ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసేందుకు ఇలా ఎమ్మెల్యేలను అక్రమంగా కొనుగోలు చేశారు. 2017లో తాను టీడీపీకి రాజీనామా చేసి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యతతో ఉప రాష్ట్రపతి, గవర్నర్, స్పీకర్‌లకు వినతి పత్రాలు ఇచ్చాను. ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాను చనిపోయేవరకు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరానన్నారు.

వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి సభలో కూర్చునేందుకు అనర్హుడన్నారు. 40 సంవత్సరాల అనుభవం అంటున్న చంద్రబాబు వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారని, ఇలాంటి నీచ నాయకులు సభలో ఉండకూడదన్నదే నా ధ్యేయమన్నారు. 175 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రివా, కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకేనా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన వారికి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన నీతిమాలిన చర్యలు చేశారన్నారు. ప్రత్యేక హోదా గురించి జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమాలు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారు. జన్మభూమి, సీఎంఆర్‌ఎఫ్‌లలోనూ దోచుకున్నారన్నారు. నాటి ప్రతిపక్షనేత అయిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి జరిగితే కోడి కత్తి అంటారు. తహసీల్దారు వనజాక్షిపై దాడి చేస్తే పట్టించుకోరన్నారు. కేవలం కక్షసాధింపు చేస్తున్నారు. తనపైనా కక్షసాధింపుగా వ్యవహరించారన్నారు. ఇంటి వద్ద చనిపోయిన విద్యార్థినిని కళాశాలలో చనిపోయిందంటూ దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిని వేధించారన్నారు. టీడీపీ నాయకుల కళాశాలల్లో జరిగిన ఆత్మహత్యలపై ఎలాంటి చర్యలు తీసుకోరన్నారు.  రాజధానిలో 33 వేల ఎకరాల భూములు ఇచ్చారని చెబుతున్నారు. ఇప్పుడు ఆ రైతులు గేదెలను పట్టుకుని రోడ్ల వెంట తిరుగుతున్నారన్నారు. ఇదేనా మీరు చేసిన పాలన అన్నారు.

2014లో ఇలాంటి పార్టీలో నేను ఎందుకు పోటీ చేశానని చింతిస్తున్నానన్నారు. ఆధార్‌ కార్డులో వయస్సు మార్చేసి ముగ్గురు అన్నదమ్ముల్లు ఏడు నెలల్లో పుట్టారని ఆధార్‌కార్డులు తయారు చేశారు. భర్తలు ఉండగానే వితంతువులుగా, భర్తలతో సంసారం చేస్తున్న వారికి ఒంటరి మహిళలుగా పింఛన్లు ఇచ్చిన ఘనత టీడీపీదన్నారు. చేనేత అంటే తెలియని వారికి చేనేత పింఛన్లు ఇచ్చారన్నారు. నీరు–చెట్లులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు ప్రవర్తనా నియమావళిని విస్మరించినా స్పీకర్‌ పట్టించుకోలేదన్నారు. రాజ్యాంగాల్ని కాపాడాల్సిన వ్యవస్థల్ని పట్టించుకొనకపోతే ముందు రోజుల్లో చట్టాలకు విలువలేకుండా పోతుందన్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని దిగదార్చి 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు ఈ సభలో కూర్చునేందుకు అర్హులు కాదని తన విశ్వాసం అన్నారు. చంద్రబాబు తన తప్పులు తెలుసుకుని చెంపలేసుకుని క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. ఆ వెంటనే తాను రాజకీయాలకు గౌరవంగా వైదొలుగుతానన్నారు.  చంద్రబాబు రాజీనామా చేయకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు.

గత ప్రభుత్వంలో పార్టీ ఫిరాయించిన వారికి ఇచ్చిన వేతనాలు, సదుపాయాలు రద్దు చేయాలని, ఇప్పటికే ఇచ్చినవి రికవరీ చేయాలని ఆయన కోరారు. పార్టీలు మారాలంటే గెలిచిన పార్టీకి రాజీనామా చేసి వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. సుప్రీం కోర్టుకంటే స్పీకర్‌ సుప్రీం అని చెప్పిన అత్యున్నత న్యాయస్థానం చెప్పినప్పుడు త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అన్యాయం చేస్తున్న వ్యక్తులను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించేందుకే తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో అత్యధిక మెజారిటీతో గెలిచానని అన్నారు. శాసన సభలో పార్టీ ఫిరాయింపులపై తీర్మాణం చేసి పార్లమెంటుకు పంపించి ఇలాంటి ఆగడాలకు స్వస్థి పలకాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు