సుబ్బయ్య టీడీపీ క్రియాశీల కార్యకర్త

5 May, 2018 04:46 IST|Sakshi

     ఎమ్మెల్యే కోటాలో ఇల్లు కూడా మంజూరు చేశారు

     వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి 

పట్నంబజారు (గుంటూరు): మానవ మృగం అన్నం సుబ్బయ్య తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్త అని వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు.  సుబ్బయ్యకు ఎమ్మెల్యే కోటాలో ఎన్టీఆర్‌ హౌసింగ్‌ స్కీమ్‌ కింద నివాస గృహాన్ని కూడా మంజూరు చేశారని వెల్లడించారు. మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగితే మూడు రోజులపాటు ఏమీ మాట్లాడని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగా కృష్ణమూర్తి శుక్రవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు.

బాలికపై అత్యాచార ఘటన జరిగిన తరువాత దాచేపల్లిలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే పిడుగురాళ్లలో ఉన్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎందుకు అక్కడికి రాలేదో చెప్పాలని ప్రశ్నించారు. మూడ్రోజుల తర్వాత జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించిన ఎమ్మెల్యే యరపతినేనికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మైనర్‌ బాలిక పేరు చెప్పకూడదన్న విజ్ఞత లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు వైఎస్సార్‌సీపీపై లేనిపోని అభాండాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు.

చట్టాలను నిర్వీర్యం చేస్తూ దోషులకు కాపలా కాసే నైజం టీడీపీదేనని విమర్శించారు. చిన్నారిపై అత్యాచార ఘటనకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ... చిన్నారిపై అత్యాచారం విషయంలో టీడీపీ నేతలు రాజకీయాలు చేసే పనిలో పడ్డారని దుయ్యబట్టారు. నిందితుడు సుబ్బయ్యకు ప్రభుత్వం మంజూరు చేసిన నివాస ధ్రువీకరణ పత్రాలను మీడియాకు చూపించారు.

మరిన్ని వార్తలు