‘ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక పరిస్థితులు’

14 May, 2018 16:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షునిగా తనను ఎంపిక చేసినందుకు కన్నా లక్ష్మీనారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని, కేంద్ర ప్రభుత్వంపై ఏపీలో అసత్యాలతో కూడిన దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి అధి​కార కోసం పాకులాడుతున్నారని విమర్శించారు.

రానున్న 2019 ఎన్నికల్లో లబ్ధి పొందడానికే బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ అవినీతి రహిత సుపరిపాలన అందిస్తున్నారని, 2014లో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 85 శాతం పనులు పూర్తి చేశారని తెలిపారు. ఏపీకి విభజన చట్టంలోని హామీలను నాలుగు సంవత్సరాల్లోనే నేరవేర్చారని తెలిపారు.

ఏపీకి కేంద్రం ఇప్పటివరకు ఇచ్చిన నిధుల గురించి ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఏపీ అభివృద్ధి విషయంలో అధికార పార్టీ టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విలఫమైందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్  అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ విఫలం కాదన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని, దీని కోసం అందరినీ కలుపుకొని పనిచేస్తానని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.

మరిన్ని వార్తలు