కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలన్ని కూల్చాలి : రమేష్‌ నాయుడు

28 Jun, 2019 16:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలోని అక్రమ కట్టడాల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు రమేష్‌ నాయుడు తెలిపారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరకట్టపై ఉన్న అన్ని అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని డిమాండ్‌ చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు చేరువులు, దేవాలయాల భూములు కబ్జా చేశారని రమేష్‌ నాయుడు ఆరోపించారు. వీటిన్నంటిని కూడా కూల్చివేయాలని.. అలా చేస్తే జగన్‌కు పుష్పాభిషేకం చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌ ఇలా ఎవరు అక్రమ కట్టడాలు కట్టినా కూల్చివేయాలని రమేష్‌ నాయుడు డిమాండ్‌ చేశారు.

విభజనలో ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయిందన్నారు రమేష్‌ నాయుడు. ఏపీ విషయంలో కేసీఆర్‌ కొంత పట్టువిడుపులు ప్రదర్శించాలని కోరారు. రాయల సీమ కరువుతో అల్లాడుతోందన్నారు. నీటి పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలు అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు వర్తింప జేయాలని.. ప్రైవేట్‌ స్కూల్లకు రెండో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

మరిన్ని వార్తలు