-

మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ

22 Jul, 2020 13:21 IST|Sakshi

ఏపీ మంత్రివర్గ విస్తరణ, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

సాక్షి, విజయవాడ : నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు మంత్రులతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 1.29 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తదితరులు హాజరు అయ్యారు. అయితే కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి పరిమిత సంఖ్యలో నేతలు హాజరు అయ్యారు. (రాజుమంత్రి అయ్యారు! )

కాగా పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక అవడంతో వారిరువురు మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారి స్థానంలో అప్పలరాజు, వేణుగోపాలకృష్ణకు మంత్రివర్గంలో అవకాశం దక్కింది. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన అప్పలరాజు 2019లో తొలిసారిగా పలాస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి అప్పలరాజుకు అవకాశం కల్పిస్తున్నారు. అలాగే  శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి తూర్పు గోదావరికి చెందిన చెల్లుబోయిన వేణుకు పదవి దక్కింది. ( రెండు శాఖలూ సీఎం వద్దే)


 

మరిన్ని వార్తలు