‘మహిళలకిచ్చిన రూ. 10 వేలు మళ్లీ వసూలు చేస్తారా’

30 Jan, 2019 12:06 IST|Sakshi

సాక్షి, విజయవాడ : అఖిలపక్ష భేటీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని.. అందుకే ఈ సమావేశాలకు తాము దూరంగా ఉంటున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు​ తెలిపారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో చంద్రబాబు ప్రభుత్వం తాయిలాలు ప్రకటిస్తోందని విమర్శించారు. పసుపు - కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు ఇస్తున్నరూ.10 వేలు రుణమా.. లేక ఉచితంగా ఇస్తున్నారా అనే అంశాన్ని జీవోలో స్పష్టం చేయలేదని పేర్కొన్నారు. అంటే మళ్లీ అధికారంలోకి వస్తే మహిళల దగ్గర నుంచి ఈ డబ్బు వసూలు చేస్తారా అని ప్రశ్నించారు.

జయహో బీసీల పేరు చంద్రబాబు వారిని మోసగిస్తున్నారని విమర్శించారు. విజయవాడలో 20 వేల మంది ఇళ్లకోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 1200 ఇళ్లు మాత్రమే నిర్మించారని తెలిపారు. చంద్రబాబు, బీజేపీతో ములాఖత్‌ అయ్యి ప్రత్యేకహోదాను గాలికోదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా కోసం పోరాడుతున్న మాపై కేసులు పెడుతున్నారని మండి పడ్డారు. అఖిలపక్ష భేటీ వల్ల విధానపరంగా ఎటువంటి ఉపయోగం ఉండదని.. అందుకే ఈ సమావేశాలకు తాము దూరంగా ఉంటున్నామని తెలిపారు మధు.

మరిన్ని వార్తలు