సకుటుంబ సపరివార సమేతంగా ఓటమి

24 May, 2019 08:27 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ సునామీలో టీడీపీ ఫ్యామిలీ ప్యాకేజీలు కొట్టుకుపోయాయి. రాయలసీమలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరి టికెట్లు దక్కించుకుంటే వారికి ఘోర పరాజయం తప్పలేదు. దశాబ్దాల వైరాన్ని మరచి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో సర్దుబాటు చేసుకుని మరీ పోటీకి దిగిన ఆ కుటుంబానికి చేదు అనుభవమే మిగిలింది. చంద్రబాబుకు ముందస్తుగా విధించిన షరతు మేరకు కోట్ల తాను కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి తన భార్య సుజాతమ్మను ఆలూరు శాసనసభ స్థానం నుంచి బరిలోకి దించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల చేతిలో వారిద్దరూ ఓడిపోయారు. 

  • డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎన్నికల్లో పోటీ చేయకుండా తన కుమారుడు కేఈ శ్యాంబాబును పత్తికొండ నుంచి సోదరుడు కేఈ ప్రతాప్‌ను డోన్‌ నుంచి బరిలోకి దించారు. వారిద్దరూ వైఎస్సార్‌సీపీ ముందు నిలవలేకపోయారు.  
  • భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి.. నంద్యాల నుంచి ఆమె సోదరుడు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. 
  • నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి జనసేన తరఫున నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి.. ఆయన అల్లుడు, కుమార్తెలు నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లె శాసనసభ స్థానాల నుంచి పోటీ చేశారు. పోలింగ్‌ అయ్యాక ఎస్పీవై రెడ్డి మరణించారు. కానీ.. ఆ ఫ్యామిలీ మొత్తం ఓడింది.
  • జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయులు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, జేసీ అస్మిత్‌ రెడ్డిని టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. 
  • సినీ నటుడు బాలకృష్ణ పెద్ద అల్లుడు నారా లోకేష్‌ మంగళగిరి నుంచి.. చిన్న అల్లుడు భరత్‌ విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. 
  • నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి బొల్లినేని రామారావు, ఆత్మకూరు నుంచి ఆయన సోదరుడు కృష్ణయ్య టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. 
  • మంత్రి గంటా శ్రీనివాసరావు.. మరో మంత్రి పి.నారాయణ, భీమవరం మాజీ ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులు వియ్యంకులు. గంటా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఓటమి అంచున ఉన్నారు. నెల్లూరు, భీమవరం నుంచి పోటీ చేసిన ఆయన ఇద్దరు వియ్యంకులు ఓటమిపాలయ్యారు. 
  • విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన అశోక్‌ గజపతిరాజు, విజయనగరం శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కుమార్తె అథితి ఓడిపోయారు.   
మరిన్ని వార్తలు